ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ సేవలపై వినియోగదారుల అసంతృప్తి మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. గతంలో ఆర్డర్ చేసిన ఆహారం సుమారు రెండు గంటలు ఆలస్యంగా డెలివరీ కావడంతోపాటు కస్టమర్ కేర్ నుంచి సరైన స్పందన లభించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఓ వినియోగదారుడు, ప్లాట్ఫామ్పై వినూత్న రీతిలో రివేంజ్ తీర్చుకున్న ఉదంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సదరు కస్టమర్ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.500 విలువైన మునుపటి ఆర్డర్ గంటల తరబడి ఆలస్యమైనప్పటికీ ఆర్డర్ రద్దుకు యాప్ యాజమాన్యం నిరాకరించింది. పైగా బాధ్యతనంతా వినియోగదారుడిపైనే నెడుతూ వంద శాతం క్యాన్సిలేషన్ ఛార్జీలు విధిస్తామని తెలిపింది. ఆటోమేటెడ్ చాట్బాట్లు, సరిగా స్పందించని కస్టమర్ సపోర్ట్ కారణంగా మానసిక క్షోభకు గురైన సదరు వ్యక్తి మరుసటి రోజు రూ.1,400 విలువైన క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ను ఉంచాడు. డెలివరీ ఏజెంట్ రాగానే దాన్ని నిరాకరించి రద్దు చేయడం ద్వారా తన నిరసన వ్యక్తం చేశాడు.
ఈ ఘటన క్విక్ కామర్స్, ఫుడ్ టెక్ రంగంలో పడిపోతున్న సేవా ప్రమాణాలను, కస్టమర్ కేర్ వ్యవస్థలలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఒకవైపు వినియోగదారులు సంస్థల బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తుండగా, మరోవైపు ఈ తరహా ప్రతీకార చర్యల వల్ల స్థానిక రెస్టారెంట్లు, అల్పదాయక డెలివరీ భాగస్వాములే ఆర్థికంగా దెబ్బతింటారని రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల హక్కులను కాపాడటంతో పాటు సంస్థల జవాబుదారీతనాన్ని నిర్దేశించే కఠిన నిబంధనలు తక్షణ అవసరమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్


