
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ భవిష్యత్తు నాయకత్వం పనితీరుపై ఆసక్తికర ప్రకటన చేశారు. బ్లూమ్బర్గ్ టెక్ కాన్ఫరెన్స్లో పిచాయ్ పాల్గొని మాట్లాడారు. సంస్థ సీఈఓ తదుపరి నిర్ణయాలు తీసుకోవడానికి, రోజువారీ కార్యకలాపాల్లో సహాయపడటానికి కృత్రిమమేథ తోడుంటుందని చెప్పారు. ఈ ప్రకటన కృత్రిమ మేధ ఆధారిత ఉత్పాదకత పట్ల గూగుల్ నిబద్ధతను నొక్కిచెబుతుంది. కృత్రిమ మేధ మానవ నాయకత్వాన్ని భర్తీ చేయడానికి బదులుగా దాన్ని మెరుగుపరుస్తుందనే భావనను పిచాయ్ ప్రకటన బలపరుస్తుంది.
ఎగ్జిక్యూటివ్ స్థాయి నాయకత్వంలో కృత్రిమ మేధను వాడడం, శ్రామిక శక్తి అంతటా ఏఐను ఏకీకృతం చేసే గూగుల్ విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఈ ప్రకటన ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. పిచాయ్ తెలిపిన వివరాల ప్రకారం కార్యనిర్వాహక నిర్ణయాలను ఆటోమేట్ చేయడానికి బదులుగా ఏఐ వ్యూహాత్మక సలహాదారుగా పనిచేస్తుంది. పెద్ద మొత్తంలో డేటాను సేకరించడానికి, వర్క్ ఫ్లోలను ఆప్టిమైజ్ చేయడానికి, సృజనాత్మక పరిష్కారాలను మరింత సమర్థవంతంగా అన్వేషించడానికి నాయకులకు ఏఐ సహాయపడుతుంది.
ఇదీ చదవండి: బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతు
వైబ్ కోడింగ్
పిచాయ్ స్వయంగా రిప్లిట్, కర్సర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోడింగ్ సాధనాలతో ప్రయోగాలు చేస్తున్నారు. వాటిని ‘వైబ్ కోడింగ్’ అని పిలుస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా సాధారణ ప్రాంప్ట్లతో కస్టమ్ వెబ్ పేజీలను సృష్టించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది. 2026 నాటికి గూగుల్ తన ఇంజినీరింగ్ టాలెంట్ పూల్ను విస్తరించడంలో ఏఐ కీలక భాగస్వామిగా పనిచేసే వ్యవస్థను ప్రోత్సహిస్తోంది.