
ప్రముఖ ఎకో రియల్టీ సంస్థ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి ఫారెస్ట్ను మరింత విస్తరిస్తూ ‘వుడ్స్ శంషాబాద్’ రెండో దశను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.300 కోట్ల ఆదాయం సమకూరుతుందని కంపెనీ అంచనా వేసింది. భారత్లో సుస్థిర నివాస స్థలాలకు పెరుగుతున్న డిమాండ్ను ఇది బలపరుస్తుందని తెలియజేసింది.
వుడ్స్ శంషాబాద్ స్థానిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించేలా జపనీస్ పర్యావరణ పునరుద్ధరణ పద్ధతి మియావాకి అటవీకరణ పద్ధతిని అమలు చేస్తుంది. దీని ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో అడవిని తలపించేలా పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ పర్యావరణాన్ని పెంపొందిస్తారు. గత మూడేళ్లుగా అభివృద్ధి చేసిన మొదటి దశలో భాగంగా ఇప్పటికే 4,50,000 చెట్లు, మొక్కలతో స్వయం సమృద్ధి సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఫేజ్ 2తో స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ 100 ఎకరాల్లో దీన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా 150 కొత్త స్థానిక వృక్ష జాతులను సాగు చేయడం, 141 పక్షి జాతులు, 126 పండ్లు, పుష్పించే చెట్లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: భారత్లో టెస్లా తయారీ లేనట్లే!
స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ఫౌండర్, సీఈఓ కీర్తి చిలుకూరి ఈ విస్తరణపై మాట్లాడుతూ..‘ఫేజ్ 1లో భాగంగా కంపెనీ అన్ని అంచనాలను అధిగమించింది. సుస్థిర జీవన నమూనాకు పెరుగుతున్న డిమాండ్ను ఇది ధ్రువీకరించింది. ఫేజ్ 2 వ్యక్తులు, కుటుంబాలకు ప్రత్యేకమైన రోజువారీ మెరుగైన జీవన వాతావరణాన్ని అనుభవించేందుకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది’ అన్నారు.