Sakshi News home page

రికార్డు స్థాయిల్లో స్థిరీకరణకు అవకాశం

Published Mon, Dec 18 2023 6:08 AM

Stock Market Experts Views and Advice - Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ రికార్డు స్థాయిలకు చేరడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి.

ఇదే వారంలో 11 కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన తరుణంలో మార్కెట్‌ వర్గాలు పబ్లిక్‌ ఇష్యూలపై కన్నేయోచ్చు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్‌ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించవచ్చు.  

‘‘అధిక వాల్యుయేషన్లు, ఎల్‌నినో ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక మందగమనం పరిణామాల నేపథ్యంలో స్వల్ప కాలం పాటు స్టాక్‌ సూచీలు రికార్డు స్థాయిల వద్ద స్థిరీకరణకు లోనవచ్చు.
ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 21,700 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,000 వరకూ ర్యాలీ కొనసాగుతుంది.

అనుకున్నట్లు స్థిరీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21500 – 21600 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సానుకూలతలు, ఫెడ్‌ రిజర్వ్‌ సరళతర ద్రవ్య విధాన అమలు యోచన, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు నమోదు నేపథ్యంలో గతవారం సూచీలు 2.32% ర్యాలీ చేశాయి.   

ప్రపంచ పరిణామాలు  
బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ వడ్డీ రేట్ల నిర్ణయం, యరోజోన్‌ నవంబర్‌ ద్రవ్యల్బోణ డేటా డిసెంబర్‌ 19న(మంగళవారం) విడుదల కానున్నాయి. అదే రోజున భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అమెరికా దిగ్గజ ఐటీ కన్సలి్టంగ్‌ సంస్థ యాక్సెంచర్‌ ఆర్థిక సంవత్సరం 2024 తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. జపాన్‌ నవంబర్‌ వాణిజ్య లోటు, బ్రిటన్‌ నవంబర్‌ ద్రవ్యోల్బణ డేటా, యూరోజోన్‌ అక్టోబర్‌ కరెంట్‌ ఖాతా, అమెరికా నవంబర్‌ గృహ అమ్మకాలు బుధవారం విడుదల కానున్నాయి.

అమెరికా ప్రస్తుత సంవత్సరపు మూడో క్వార్టర్‌ జీడీపీ డేటా గురువారం వెలువడుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్‌ ద్రవ్యోల్బణం, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు, బ్రిటన్‌ క్యూ3 జీడీపీ గణాంకాలు విడుదల అవుతాయి. కీలక ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు మార్కెట్‌ వర్గాలు అప్రమత్తత వహించే వీలుంది.

ప్రథమార్థంలో రూ.29,700 కోట్ల కొనుగోళ్లు  
విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్‌ ప్రథమార్థంలో రూ.27,000 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘మూడు ప్రధాన రాష్ట్రాల్లో అధికార పార్టీ బీజేపీ గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే అంచనాలు, మెరుగైన ఆర్థిక వృద్ధి, మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్‌ సరళతర ద్రవ్య విధాన అమలు యోచనలు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లను ప్రోత్సహించాయి’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీప్‌ హెడ్‌ విజయకుమార్‌ తెలిపారు. ముఖ్యంగా ఐటీ, ఇన్ఫ్రా, పారిశ్రామిక రంగాల షేర్లను కొనుగోళ్లు చేశారు. రానున్న రోజుల్లో లాభాల స్వీకరణకు పాల్పడొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

12 పబ్లిక్‌ ఇష్యూలు 8 లిస్టింగులు  
ఈ వారంలో ప్రాథమిక మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు 12  కంపెనీలు తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు రానున్నాయి. ఇందులో ప్రధాన విభాగం(8 కంపెనీలు)తో పాటు చిన్న మధ్య తరహా స్థాయి(4 కంపెనీలు) విభాగానికి చెందినవి ఉన్నాయి. ముత్తూట్‌ మైక్రో ఫిన్, మోతీసన్స్‌ జ్యువెలర్స్, సురజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఐపీఓలు సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తాయి.

హ్యాపి ఫోర్జ్, ఆర్‌బీజెడ్‌ జ్యువెలర్స్, క్రెడో బ్రాండ్స్‌ మార్కెటింగ్‌ ఐపీఓలు డిసెంబర్‌ 19–21 మధ్య జరగునున్నాయి. అజాద్‌ ఇంజనీరింగ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ 20–22 తేదీల్లో, ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌ ఐపీఓ 21–26 తేదీల్లో జరగనుంది. ఎస్‌ఎంఈ విభాగం నుంచి సహారా మారిటైం, శాంతి స్పిన్‌టెక్స్, ఎలక్ట్రో ఫోర్స్, ట్రిడెంట్‌ టెక్‌ల్యాబ్‌లు కంపెనీలు ఐపీఓకు సిద్ధమయ్యాయి. డోమ్స్‌ ఇండస్ట్రీస్, ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కంపెనీల షేర్లు బుధవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ఐనాక్స్‌ ఇండియా లిస్టింగ్‌ గురువారం ఉంది. చిన్న మధ్య తరహా స్థాయి విభాగం నుంచి 5 కంపెనీల షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement