
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పతనమయ్యాయి. నిఫ్టీ 50 ఎఫ్ అండ్ ఓ వారాంతపు గడువు ముగియడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు పెరగడం, ట్రంప్ వాణిజ్య ఒప్పందం గడువు సమీపించడం వంటి అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు భారీగా నష్టపోయాయి.
ఇంట్రాడేలో 81,523.16 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 823.16 పాయింట్లు లేదా 1 శాతం క్షీణించి 81,691.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 253.2 పాయింట్లు లేదా 1.01 శాతం క్షీణించి 24,888.2 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.73 శాతం, 1.90 శాతం నష్టపోయాయి.
అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే స్థిరపడ్డాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 2.02 శాతం క్షీణించగా, ఫీనిక్స్, గోర్డెజ్ ప్రాపర్టీస్, అనంత్ రాజ్, డీఎల్ఎఫ్, ప్రెస్టీజ్, శోభా, బ్రిగేడ్, మాక్రోటెక్ డెవలపర్స్ 3 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1 శాతానికి పైగా నష్టపోయాయి.
సెన్సెక్స్ లోని 30 షేర్లలో 27 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, టైటాన్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎల్అండ్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.54 శాతం పెరిగి 14.01 పాయింట్ల వద్ద స్థిరపడింది.ㅤ ㅤ ㅤ