
రూ. 8,077 కోట్లు చెల్లింపు
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరానికి(2024–25) షేరుకి రూ. 15.9 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీంతో సంస్థ ప్రమోటర్ కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 8,077 కోట్ల డివిడెండ్ చెల్లించింది.
ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు, ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ సేథ్ సమక్షంలో ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు డివిడెండ్ చెక్ అందించారు. కాగా.. అంతక్రితం ఏడాదిలో షేరుకి రూ. 13.7 చొప్పున ప్రభుత్వానికి రూ. 6,959 కోట్లకుపైగా డివిడెండ్ చెల్లించిన సంగతి తెలిసిందే. గతేడాది ఎస్బీఐ 16 శాతం అధికంగా రూ. 70,901 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకుముందు 2023–24లో రూ. 61,077 కోట్ల లాభం సాధించింది.