
రుణ గ్రహీతలకు ఎస్బీఐ గుడ్ న్యూస్
రుణాలపై 0.50% వడ్డీ రేటు కోత
డిపాజిట్లపై పావు శాతం మేర తగ్గింపు
దిగిరానున్న ఈఎంఐల భారం
న్యూఢిల్లీ: రుణ గ్రహీతలకు ఎస్బీఐ పెద్ద ఉపశమనాన్ని కలి్పంచింది. ఆర్బీఐ రెపో రేటు 0.50 శాతం తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా రుణ గ్రహీతలకు బదలాయించింది. వివిధ రకాల రుణాలపై 50 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ నిర్ణయించింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు తగ్గనున్నాయి. ఎస్బీఐ రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) తగ్గించింది.
ఈ తగ్గింపు అనంతరం ఆర్ఎల్ఎల్ఆర్ రేటు 7.75 శాతానికి దిగొచి్చంది. అలాగే, ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత రుణ రేటును (ఈబీఎల్ఆర్) సైతం 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించింది. సవరించిన రేట్లు జూన్ 15 నుంచే అమల్లోకి వచ్చాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ (ఎంసీఎల్ఆర్) రేట్లలో ఎస్బీఐ ఎలాంటి సవరణలు చేయలేదు.
దీంతో ఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 8.2 శాతంగా, మూడు నెలల రేటు 8.55 శాతం, ఆరు నెలల రేటు 8.90 శాతం, ఏడాది ఎంసీఎల్ఆర్ 9 శాతం, రెండేళ్ల రేటు 9.05 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.10 శాతం చొప్పున ఉన్నాయి. ఆర్బీఐ ఈ నెల ఆరంభంలో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్లు తమ రుణ రేట్లను సైతం వేగంగా సవరించడం గమనార్హం. ఇప్పుడు ఎస్బీఐ సైతం ఇదే నిర్ణయాన్ని అమలు చేసింది. రుణ గ్రహీతల క్రెడిట్ స్కోరును బట్టి ఎస్బీఐ గృహ రుణ రేటు 7.50 శాతం నుంచి 8.45 శాతం మధ్య ఉండనుంది.
డిపాజిట్ రేట్లకూ కోత
మరోవైపు వివిధ కాల వ్యవధి డిపాజిట్లపై రేటును సైతం ఎస్బీఐ తగ్గించింది. రూ.3 కోట్ల వరకు అన్ని కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 1–2 ఏళ్ల డిపాజిట్లపై రేటు తగ్గింపు అనంతరం 6.50 శాతానికి దిగొచి్చంది. 2–3 ఏళ్ల డిపాజిట్లపై రేటు 6.70 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గింది. 3–5 ఏళ్లలో మెచ్యూరిటీ తీరే డిపాజిట్లపై వడ్డీ రేటు 6.30 శాతం, 5–10 ఏళ్ల డిపాజిట్లపై రేటు 6.05 శాతానికి తగ్గింది. 444 రోజుల అమృత్ వృష్టి డిపాజిట్పై రేటు 6.85 శాతం నుంచి 6.60 శాతానికి తగ్గింది. 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు సాధారణ రేట్లపై 50 బేసిస్ పాయింట్లు, 80 ఏళ్లు నిండిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 60 బేసిస్ పాయింట్ల అదనపు రేటు డిపాజిట్లపై లభిస్తుంది.
పెద్ద ఊరటే..
రూ.50 లక్షల గృహ రుణం, 8 శాతం రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకునేట్టు అయితే తాజా 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు రూపంలో రుణ గ్రహీతకు రూ.3.70 లక్షలు ఆదా కానుంది. 8 శాతం రేటుపై రేటు సవరణకు ముందు నెలవారీ ఈఎంఐ 41,822 కాగా, సవరణ తర్వాత రూ.40,280కు దిగివస్తుంది. ఈఎంఐ తగ్గించుకోకుండా పూర్వపు మాదిరే చెల్లిస్తూ వెళ్లేట్టు అయితే నిర్ణీత కాల వ్యవధి కంటే ముందుగానే రుణం తీరిపోతుంది.