బంగారం, వెండి ధరలు తారుమారవుతున్న వేళ 'రాబర్ట్ కియోసాకి' ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగారం ఇప్పుడే మలుపు తిరిగింది. నా అంచనా తప్పయినప్పటికీ.. గోల్డ్, సిల్వర్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
పెట్టుబడిదారుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు భవిష్యత్తులో బంగారం ధర 35,000 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా.. గత అనుభవాలను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో ప్రారంభమైన పెద్ద బుల్ రన్ సమయంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో కొందరు పెట్టుబడిదారులు మంచి లాభాలను పొందారు. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు మళ్లీ ఏర్పడవచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అప్పుల భారంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ కరెన్సీలపై నమ్మకం తగ్గి, బంగారం వంటి సురక్షితమైన ఆస్తులపై డిమాండ్ పెరుగుతుందని కియోసాకి చెప్పారు.
'బంగారం అనేది నిజమైన డబ్బు, మిగతావన్నీ క్రెడిట్ మాత్రమే' అనే జేపీ మోర్గాన్ అభిప్రాయాన్ని కూడా కియోసాకి ఉదహరించారు. దీన్నిబట్టి చూస్తే.. అమెరికన్ డాలర్ కూడా ఒక రకమైన అప్పు ఆధారిత వ్యవస్థగా కనిపిస్తుందని వారు అంటున్నారు. అందువల్ల ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి ఆస్తులు మరింత బలపడతాయని చెబుతున్నారు.
అంతే కాకుండా.. ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది భవిష్యత్తులో ఆర్థిక, ఉద్యోగ, పెట్టుబడి రంగాల్లో పెద్ద మార్పులను తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ మార్పుల మధ్య పెట్టుబడిదారులు తమ ఆర్థిక నిర్ణయాలను మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.


