రిలయన్స్ భారీ ప్లాన్.. మూడేళ్ల తర్వాత బాండ్ మార్కెట్‌లోకి! | Reliance Set to Return to Bond Market After 3 Years, Know The Details | Sakshi
Sakshi News home page

రిలయన్స్ భారీ ప్లాన్.. మూడేళ్ల తర్వాత బాండ్ మార్కెట్‌లోకి!

Sep 8 2026 5:56 PM | Updated on Sep 8 2026 6:17 PM

Reliance Set to Return to Bond Market After 3 Years, Know The Details

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు మూడేళ్ల తర్వాత.. మళ్లీ ఇండియా రుపీ బాండ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. కంపెనీ భారీ మొత్తంలో నిధులను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ బాండ్ ఇష్యూ పూర్తయితే, 2023 నవంబర్ తర్వాత ఒక రేటెడ్ కంపెనీ చేపట్టే అతిపెద్ద సింగిల్-ట్రాంచ్ ఫండ్ రైజింగ్‌గా నిలిచే అవకాశం ఉంది.

రూ.12,500 కోట్ల సమీకరణ
రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు రూ.12,500 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఇందుకోసం ఐదేళ్ల కాలపరిమితి ఉన్న బాండ్లను జారీ చేయనుంది. ఈ బాండ్లపై ఏడాదికి 7.47 శాతం వడ్డీ చెల్లించే అవకాశం ఉంది. ఇన్వెస్టర్ల నుంచి బిడ్లను సెప్టెంబర్ 18తో ముగిసే వారంలో ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం.

2023 తర్వాత తొలిసారి
రిలయన్స్ ఇండస్ట్రీస్ చివరిసారిగా 2023 నవంబర్‌లో దేశీయ రూపాయి బాండ్ మార్కెట్ ద్వారా నిధులు సమీకరించింది. అప్పుడు కంపెనీ ఏకంగా రూ.20,000 కోట్లను సమీకరించింది. దీంతో ఇది భారతదేశంలో నాన్-ఫైనాన్షియల్ కంపెనీ చేపట్టిన అతిపెద్ద లోకల్ కరెన్సీ డెట్ ఇష్యూగా నిలిచింది. ఇప్పుడు మరోసారి భారీ మొత్తంలో నిధులు సమీకరించేందుకు రిలయన్స్ సిద్ధమవుతుండటం మార్కెట్‌లో ఆసక్తిని పెంచుతోంది.

రూపాయి బాండ్ల వైపు ఎందుకు?
ప్రస్తుతం భారత్‌లో ఐదేళ్ల వరకు ఉన్న బాండ్లపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి. దీంతో డాలర్లలో రుణాలు తీసుకోవడం కంటే రూపాయిల్లో బాండ్లు జారీ చేసి నిధులు సమీకరించడం కంపెనీలకు చౌకగా మారింది.

జూన్ ప్రారంభం నుంచి ఐదేళ్ల ప్రభుత్వ బాండ్ రాబడి దాదాపు 33 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి దేశంలోకి వచ్చిన భారీ డాలర్ ప్రవాహాలు. అదే సమయంలో అమెరికా ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు పెరగడంతో డాలర్లలో రుణాలు తీసుకోవడం భారతీయ కంపెనీలకు మరింత ఖరీదుగా మారింది. ఈ పరిస్థితి కూడా రిలయన్స్ వంటి సంస్థలను దేశీయ బాండ్ మార్కెట్ వైపు ఆకర్షిస్తోంది.

10 ఏళ్ల బాండ్స్
ఈ బాండ్ ఇష్యూకు కొన్ని పెద్ద ప్రైవేట్ బ్యాంకులు అరేంజర్లుగా వ్యవహరించనున్నాయి. అంతేకాకుండా.. ఈ బాండ్లలో కొంత భాగాన్ని ఆ బ్యాంకులే కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందని సమాచారం. ఐదేళ్ల బాండ్లతో పాటు 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న బాండ్లను కూడా జారీ చేయాలా అనే విషయంపై రిలయన్స్ ఆలోచిస్తోంది. ఇందుకోసం బ్యాంకర్లు, ఇన్వెస్టర్లతో కంపెనీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement