బాంబే క్రీమరీ బ్రాండ్ షురూ
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ అనుబంధ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్(ఆర్సీపీఎల్) దేశీ ఐస్క్రీమ్ మార్కెట్లోకి ప్రవేశించింది. బాంబే క్రీమరీ బ్రాండుతో ప్రొడక్టులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కంపెనీకున్న పంపిణీ మౌలికసదుపాయాలు, రిటైల్ షాపులు, వినియోగదారులు ఇందుకు మద్దతివ్వనున్నట్లు ఆర్సీపీఎల్ తెలియజేసింది. బాంబే క్రీమరీ ప్రొడక్టులను వాస్తవిక డెయిరీ క్రీమ్తో రూపొందిస్తున్నట్లు ఆర్సీపీఎల్ పేర్కొంది. బాంబే క్రీమరీ ప్రొడక్టుల ద్వారా అందుబాటు ధరలలో అసలైన ఐస్క్రీమ్ రుచిని అందించనున్నట్లు ఆర్సీపీఎల్ డైరెక్టర్ టి.కృష్ణకుమార్ తెలియజేశారు.
రూ.10 ప్రారంభ ధరతో కోన్లు, కప్పులతోపాటు.. టబ్స్, స్టిక్స్, బార్స్ విక్రయించనున్నట్లు వివరించారు. తొలుత పశ్చిమ భారత్లో అమ్మకాలు ప్రారంభించి తదు పరి దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. 2025కల్లా దేశీ ఐస్క్రీమ్ మార్కెట్ విలువను సుమారు రూ. 31,276 కోట్లుగా మదింపు చేశారు. ఐబీఈఎఫ్ నివేదిక ప్రకారం 2034కల్లా సగటున 11–14 శాతం వార్షిక వృద్ధితో రూ. 63,941 కోట్లను తాకగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
దేశీ ఐస్క్రీమ్ మార్కెట్లో 40% వాటాతో అముల్ అగ్రభాగాన నిలుస్తుంటే.. యూనిలీవర్ సంస్థ క్వాలిటీ వాల్స్, వడీలాల్ తదుపరి ర్యాంకును ఆక్రమించాయి. ఈ బాటలో హ్యావ్మోర్, మదర్ డెయిరీ ప్రొడక్టులు సైతం 9–6 % మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ప్రీమియం ధరల విభాగంలో క్రీమ్ బెల్, నేచురల్స్, బస్కిన్ రాబిన్స్ పోటీ పడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: బెర్త్ బుక్ చేసినా.. పడుకోకూడదు!


