అది 2016 సెప్టెంబర్ 5. భారతదేశపు టెలికాం చరిత్రలో ఒక సంచలన ఘట్టానికి తెరలేచిన రోజు. మొబైల్ డేటా అంటే అదొక నిత్యావసర సరుకు కాదు, కేవలం శ్రీమంతుల విలాసవంతమైన వస్తువు అనే భావన బలంగా ఉన్న రోజులు అవి. డేటా ఆన్ చేస్తే పైసలు ఖర్చయిపోతాయేమో అని ఇంటర్నెట్ వాడటానికి కూడా జంకే పరిస్థితుల నుంచి పరిమిత సబ్స్క్రిప్షన్తో అపరిమిత డేటా అనే దిశగా భారత టెలికాం రంగాన్ని శాసించిన సంస్థ రిలయన్స్ జియో. సరిగ్గా పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ డిజిటల్ ప్రస్థానం నేడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో సాంకేతిక, సామాజిక విప్లవాన్ని తీర్చిదిద్దింది. జియో పుట్టి పదేళ్లు అయిన నేపథ్యంలో ‘సాక్షి.కామ్ బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనం..
జియో దెబ్బకు భారీగా పడిన డేటా ధరలు
పదేళ్ల క్రితం ఒక జీబీ (1 GB) డేటా కొనాలంటే కనీసం రూ.228 వెచ్చించాల్సి వచ్చేది. సగటు భారతీయుడు నెలకు కనీసం 200 మెగాబైట్లు (0.2 GB) వాడటానికి కూడా వెనుకాడేవాడు. అటువంటి రోజుల్లో డేటా అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అనే సూత్రంతో జియో మార్కెట్లోకి అడుగుపెట్టింది. జియో దెబ్బకు నేడు డేటా ధర 97 శాతం పడిపోయి ఒక్క జీబీ రూ.7.9 కి లభిస్తుండగా సగటు వినియోగదారుని నెలవారీ డేటా వినియోగం ఏకంగా 42.3 జీబీకి చేరింది.
తెలుగు నేలపై వృద్ధి పరుగులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ (తెలంగాణ, ఏపీ) సరసన జియో మెరుగైన వృద్ధి సాధించింది. అప్పటివరకు ఏళ్ల తరబడి రాజ్యమేలిన పాత సంస్థల పునాదులను కదిలిస్తూ జియో దూసుకెళ్లింది.
2016 ఆగస్టు నాటికి ఒక్క వినియోగదారుడు కూడా లేని చోట 2026 జూన్ నాటికి జియో చందాదారుల సంఖ్య 325.8 లక్షలకు (3.258 కోట్లు) చేరింది. ఇది ఏటా 39.9 శాతం సంయుక్త వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్).
ఇరు రాష్ట్రాల్లో మొత్తం వైర్లెస్ కనెక్షన్లలో 36.9% మార్కెట్ షేర్తో జియో రెండో అతిపెద్ద శక్తిగా నిలిచింది. 2024 జూన్ నాటికి అత్యధికంగా 3.307 కోట్ల చందాదారుల రికార్డును నెలకొల్పింది.
| ఆపరేటర్ | ఆగస్టు 2016 (లక్షల్లో) | జూన్ 2026 (లక్షల్లో) | నికర మార్పు (లక్షల్లో) | 10 ఏళ్ల వార్షిక వృద్ధి (సీఏజీఆర్) |
|---|---|---|---|---|
| రిలయన్స్ జియో | — | 325.8 | +313.4 | 39.9% |
| భారతీ ఎయిర్టెల్ | 241.7 | 394.1 | +152.4 | 5.1% |
| వొడాఫోన్ ఐడియా | 228.6 | 87.3 | -141.3 | -9.3% |
| బీఎస్ఎన్ఎల్ | 97.5 | 75.8 | -21.7 | -2.5% |
| ఇతరులు | 164.1 | 0.0 | -164.1 | నిష్క్రమించాయి |
(మూలం: ట్రాయ్ నివేదికలు, సెప్టెంబర్ 2016 నుంచి పరిగణలోకి తీసుకున్న జియో గణాంకాలు)
మార్కెట్ ఏకీకరణ
2016లో ఎనిమిదికి పైగా ఆపరేటర్లతో రద్దీగా ఉన్న టెలికాం మార్కెట్, జియో రాకతో కేవలం నలుగురికి పరిమితం అయింది. టాటా టెలికాం, ఆర్కామ్, ఎయిర్సెల్ వంటి చిన్న సంస్థలు అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అన్నట్లుగా పోటీ తట్టుకోలేక తట్టాబుట్టా సర్దేసాయి. ఇక వొడాఫోన్, ఐడియాలు కలిసినా కూడా కస్టమర్ల వలసను అడ్డుకోలేక 2.2 కోట్ల నుంచి 87.3 లక్షలకు పడిపోయాయి. జియో రాక కేవలం కస్టమర్లను సంపాదించుకోవడమే కాకుండా కొత్తగా కోట్లాది మందిని డిజిటల్ పరిధిలోకి తెచ్చింది. ట్రాయ్ అధికారిక లెక్కల ప్రకారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్లో (ఏపీ, తెలంగాణ) మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 7.47 కోట్ల నుంచి 8.83 కోట్లకు పెరిగింది.
పెరిగిన వినియోగదారులు
చౌకైన ఇంటర్నెట్ నేడు ఆర్థిక చక్రానికి ఇంధనంగా మారింది. విజయవాడలోని వీధి వ్యాపారి నుంచి వరంగల్లోని టీ కొట్టు యజమాని వరకు ప్రతి ఒక్కరి చేతిలో క్యూఆర్ కోడ్ ఉంది. దేశంలో డిజిటల్ వ్యాలెట్ వినియోగదారులు 2016లో స్వల్ప సంఖ్య నుంచి 2026 నాటికి 55.6 కోట్లకు చేరారు. ఓటీటీ విభాగంలో 3 కోట్ల నుంచి 60.1 కోట్ల వీక్షకులకు ఎగబాకింది.
5G స్వదేశీ పరిజ్ఞానంతో.. 6G వైపు అడుగులు
4G లో ప్రపంచ దేశాల కంటే వెనుకబడిన భారత్, 5G విషయంలో జియో వేగంతో ప్రపంచంతో పోటీపడింది. కేవలం 15 నెలల్లోనే దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ను విస్తరించి 26.8 కోట్ల 5G కస్టమర్లను సంపాదించింది. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా ‘మేక్ ఇన్ ఇండియా’ పద్ధతిలో సొంతంగా క్లౌడ్-నేటివ్ 5G ఆర్కిటెక్చర్ను అభివృద్ధి చేసింది. 11,303 మంది పరిశోధకులతో, 6,817 పేటెంట్ల బలం తోడైన జియో రాబోయే 6G ప్రమాణాలను సైతం శాసించే స్థాయికి ఎదిగింది.
జియోభారత్ చౌక ఫోన్లు..
జియోభారత్ చౌక ఫోన్ల ద్వారా మిగిలిన 2G వినియోగదారులను 4G వైపు మళ్లించడం, ఎయిర్ ఫైబర్ ద్వారా 2.7 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంతో జియో డిజిటల్ అసమానతలను అధిగమించింది. 2026 నాటికి రూ.1,46,885 కోట్ల ఆదాయం ఆర్జించిన జియో కేవలం టెలికాం కంపెనీగా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ రంగాలను నడిపించే ఒక దేశీయ సాంకేతిక దిగ్గజంగా రూపాంతరం చెందింది.
ఇదీ చదవండి: టెస్లా డ్రైవర్లెస్ రోబోటాక్సీ!


