
పునరుత్పాదక విద్యుత్కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కొత్తగా రిలయన్స్ న్యూ ఎనర్జీస్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. మయాంక్ బన్సల్ను సీఈవోగా, రాకేశ్ స్వరూప్ను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నియమించింది. ఈ సంస్థ ప్రధానంగా సౌర, పవన విద్యుదుత్పత్తి.. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం మొదలైన సొల్యూషన్స్పై దృష్టి పెడుతుంది.
పునరుత్పాదక విద్యుత్ విభాగంలో బన్సల్కి 25 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ఆయన రెన్యూ పవర్కి చెందిన ఇండియా ఆర్ఈ బిజినెస్కి గ్రూప్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు. ఇంధన రంగం, స్టార్టప్ల విభాగంలో స్వరూప్నకు 17 ఏళ్ల పైగా అనుభవం ఉంది. ఆయన గతంలో రెన్యూ పవర్, పీఆర్ క్లీన్ ఎనర్జీ మొదలైన సంస్థల్లో కీలక హోదాల్లో పని చేశారు.
కాగా రిలయన్స్ పవర్ మరో అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యూ సన్టెక్ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఈ-రివర్స్ వేలంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ప్రాజెక్ట్ కోసం 930 మెగా వాట్ల సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ను పొందింది.