
నయారా ఎనర్జీలో 49.13 శాతం వాటాపై కన్ను
డైవర్సిఫైడ్ దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్.. రష్యా చమురు దిగ్గజం పీజేఎస్సీ రాస్నెఫ్ట్ ఆయిల్ కంపెనీ మధ్య డీల్ కుదరనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం రాస్నెఫ్ట్ దేశీ యూనిట్ నయారా ఎనర్జీలో 49.13 శాతం వాటాను రిలయన్స్కు విక్రయించనుంది. దేశీయంగా నయారా ఎనర్జీ 20 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల చమురు రిఫైనరీతోపాటు.. 6,750 పెట్రోల్ పంపులను నిర్వహిస్తోంది. నయారా కొనుగోలుకి రాస్నెఫ్ట్తో రిలయన్స్ ప్రాథమిక చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలు
ఈ కొనుగోలు పూర్తయితే చమురు రంగ పీఎస్యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)ను వెనక్కి నెట్టి అతిపెద్ద కంపెనీగా నిలిచే వీలుంది. అటు చమురు శుద్ధిసహా ఇటు పెట్రోల్ బంకుల నిర్వహణలో నంబర్ వన్ ర్యాంకును పొందనుంది. అయితే తొలి దశ చర్చలు మాత్రమే జరుగుతున్న నేపథ్యంలో డీల్పై అంచనాలకు రాలేమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై రెండు సంస్థల నుంచి తగిన సమాచారం లభించలేనట్లు తెలియజేశాయి. 2017లో రాస్నెఫ్ట్.. 12.9 బిలియన్ డాలర్లకు ఎస్సార్ ఆయిల్ను కొనుగోలు చేసింది. తదుపరి ఎస్సార్ ఆయిల్ పేరును నయారా ఎనర్జీగా మార్పు చేసింది.