పసిడి కాంతుల్లో సెంట్రల్‌ బ్యాంకులు | RBI adds eight tonnes gold to its reserves in November 2024 | Sakshi
Sakshi News home page

పసిడి కాంతుల్లో సెంట్రల్‌ బ్యాంకులు

Jan 7 2025 6:26 AM | Updated on Jan 7 2025 8:05 AM

RBI adds eight tonnes gold to its reserves in November 2024

నవంబర్‌లో ఆర్‌బీఐ కొనుగోళ్లు 8 టన్నులు

ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల క్యూ

కొనుగోళ్లు 53 టన్నులు 

ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక

ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాలతో ప్రపంచ బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. 2024 నవంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల 53 టన్నుల పసిడి నిల్వలను పెంచుకోగా, ఇందులో భారత్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వాటా 8 టన్నులు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 

→ 2024లో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని స్థిరమైన, భద్రమైన అసెట్‌గా భావించి, కొనుగోళ్లకు ఆసక్తి ప్రదర్శించాయి. ముఖ్యంగా 2024 చివరి భాగాన్ని పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపాయి.  
→ అమెరికా ఎన్నికల అనంతరం నవంబర్‌లో బంగారం ధరలు తగ్గాయి. దీనిని కొనుగోళ్లకు ఒక మంచి అవకాశంగా సెంట్రల్‌ బ్యాంకుల భావించాయి.  
→ నవంబర్‌లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్‌బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు అయ్యింది. దీనితో భారత్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వద్ద  మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరాయి. 
→ 2024లో రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్‌ కొనసాగింది. మొదటి స్థానంలో పోలాండ్‌ ఉంది. పోలాండ్‌  నేషనల్‌ బ్యాంకు నవంబర్‌లో 21 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 90 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. 
→ ఉజ్బెకిస్తాన్‌ కేంద్ర బ్యాంకు 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 11 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.దీనితో ఈ దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 382 టన్నులకు చేరాయి.  
→ కజికిస్గాన్‌ నేషనల్‌ బ్యాంక్‌ నవంబర్‌లో 5 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, మొత్తం దేశ బంగారం నిల్వలు 295 టన్నులకు చేరాయి.  
→ చైనా పీపుల్స్‌ బ్యాంక్‌ (పీబీఓసీ) ఆరు నెలల విరామం తర్వాత బంగారం కొనుగోళ్లను పునఃప్రారంభించి, నవంబర్‌లో 5 టన్నులు కొనుగోళ్లు జరిగింది. వార్షికంగా నికర కొనుగోళ్లు 34 టన్నులు. మొత్తం పసిడి నిల్వలు 2,264 టన్నులకు (మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలో 5 శాతం) చేరాయి.  
→ జోర్డాన్‌ నవంబర్‌లో 4 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగింది. జూలై తర్వాత దేశం పసిడి కొనుగోళ్లు జరిపింది నవంబర్‌లోనే కావడం గమనార్హం. దేశం మొత్తం పసిడి నిల్వలు 73 టన్నులకు ఎగశాయి.  
→ టర్కీ నవంబర్‌లో జరిపిన కొనుగోళ్ల పరిమాణం 3 టన్నులు.  
→ చెక్‌ నేషనల్‌ బ్యాంక్‌ వరుసగా 21 నెలలుగా కొనుగోళ్లు జరుపుతోంది. నవంబర్‌లో జరిపిన కొనుగోళ్లు 2 టన్నులు. వార్షికంగా కొనుగోళ్లు 20 టన్నులు. దీనితో బ్యాంకు వద్ద మొత్తం నిల్వలు 50 టన్నులపైకి ఎగశాయి.  
→ ఘనా నేషనల్‌ బ్యాంక్‌ నవంబర్‌లో టన్నుల కొనుగోళు చేయగా, వార్షికంగా చేసిన కొనుగోళ్లు 10 టన్నులు. దీనితో దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 29 టన్నులకు చేయాయి. ఎకానమీ స్థిరత్వానికి పసిడి నిల్వలు కీలకమని ఘనా భావిస్తోంది.

సింగపూర్‌ అమ్మకాలు.. 
కాగా, సింగపూర్‌ మానిటరీ అథారిటీ నవంబర్‌లో 5 టన్నుల బంగారాన్ని విక్రయించింది. 2024లో ఇప్పటి వరకు 7 టన్నుల నికర అమ్మకాలు జరిపింది. దీనితో మొత్తం నిల్వలు 223 టన్నులకు తగ్గాయి.

Advertisement
 
Advertisement
Advertisement