Surinder Chawla : పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌కు మరో షాక్‌! | Paytm Payments Bank Md, Ceo Surinder Chawla Resigns | Sakshi
Sakshi News home page

Surinder Chawla : పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌కు మరో షాక్‌!

Apr 9 2024 6:09 PM | Updated on Apr 9 2024 9:24 PM

Paytm Payments Bank Md, Ceo Surinder Chawla Resigns - Sakshi

ప్రముఖ ఫిన్‌టెక్‌ దిగ్గజం పేటీఎంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) సీఈఓ పదవికి సురీందర్‌ చావ్లా రాజీనామా చేశారు.  

వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు చావ్లా తెలిపారు. మెరుగైన కెరీర్‌ కోసం అవకాశాలను అన్వేషించాలని ఉద్దేశంతో పీపీబీఎల్‌ నుంచి వైదొలుగుతున్నట్లు స్టాక్‌ మార్కెట్‌ ఫైలింగ్‌లో వెల్లడించారు. పీపీబీఎల్‌లో చావ్లా జూన్‌ 26 వరకు కొనసాగనున్నారు.  

గత ఏడాది జనవరి 9న చావ్లా పేమెంట్ బ్యాంక్‌లో చేరారు. అంతకు ముందు ఆర్‌బీఎల్‌  బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్‌గా ఉన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ , స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో పాటు ఇతర సంస్థలలో పనిచేసిన చావ్లాకు బ్యాంకింగ్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది.

పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌పై ఆరోపణలు 
పేటీఎం వ్యాలెట్‌, పేమెంట్స్‌ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బయటి ఆడిటర్లు పూర్తిస్థాయిలో ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్‌బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2024 ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లతో పాటు ఇతర లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఆ గడువు తేదీని మార్చి 15వరకు పొడిగింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇతర యూపీఐ పేమెంట్స్‌ గూగుల్‌ పే, ఫోన్‌పే తరహాలో సేవలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి 

పీపీబీఎల్‌ నుంచి విడిపోయిన పేటీఎం
ఆర్‌బీఐ ఆదేశాల మేరకు పీపీబీఎల్‌ నుంచి పేటీఎం వ్యాపార లావాదేవీలకు స్వస్తి చెప్పింది.  బ్యాంక్ బోర్డు స్వతంత్ర చైర్‌పర్సన్‌తో పాటు ఐదుగురు స్వతంత్ర డైరెక్టర్‌లతో పునర్నిర్మించినట్లు  స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. 

Advertisement
 
Advertisement
Advertisement