
బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు అవసరాలకు అనుగునంగా నిబంధనల ప్రకారం లోన్లు ఇస్తూంటాయి. వాటిని వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్లు ఉంటారు. అయితే రికవరీ ఏజెంట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. రికవరీ ఏజెంట్లు రుణాల రికవరీ కోసం ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత రుణగ్రహీతలు ఫోన్ చేయకూడదనే నిబంధనలను ఆర్బీఐ ప్రతిపాదించింది. డైరెక్ట్ సేల్స్ ఏజెంట్లు (డీఎస్ఏ), డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లు (డీఎంఏ), రికవరీ ఏజెంట్ల కోసం నియంత్రిత సంస్థలు ఈ నియామవళిని పాటించే విధంగా చూడాలని ఆర్బీఐ భావిస్తుంది.
ఆర్బీఐ ప్రతిపాదించబోతున్న నిబంధనల ప్రకారం..రికవరీ ఏజెంట్లు కస్టమర్లను అభ్యర్థించడం, కాల్ చేసే గంటలు, కస్టమర్ సమాచారం గోప్యత, సంస్థలు ఇస్తున్న ఆఫర్లోని ఉత్పత్తుల నిబంధనలు, షరతులను స్పష్టంగా తెలియజేయాలి. బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పేమెంట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియన్ సెంటర్లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, పట్టణ, రాష్ట్ర, కేంద్ర సహకార బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
రికవరీ ఏజెంట్లు తమ రుణ సేకరణ ప్రయత్నాల్లో భాగంగా ఏ వ్యక్తిపై మానసికంగా, శారీరకంగా ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని ఆర్బీఐ డ్రాఫ్ట్ నిబంధనల్లో పేర్కొంది. రుణగ్రహీత కుటుంబ సభ్యులు, రిఫరీలు, స్నేహితులను అవమానించడం లేదా వారి ఇంట్లోకి చొరబడడం, మొబైల్ లేదా సోషల్ మీడియా ద్వారా అనుచిత సందేశాలు పంపడం, అనామక కాల్లు చేయడాన్ని నిషేధించేలా చర్యలు తీసుకుంటున్నారు.