భారతీయ కళలు, సంస్కృతికి అంతర్జాతీయ వేదికగా.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కళా ప్రదర్శనలు, సంగీత, నాటక ప్రదర్శనలను భారత ప్రేక్షకులకు చేరువ చేసే కేంద్రంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ముంబైలో 2023 మార్చిలో ప్రారంభమైన ఈ సాంస్కృతిక కేంద్రం మూడేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఘనమైన కళా వేడుకలకు వేదికను పంచింది.
మూడేళ్లలో ఎన్మ్యాక్లో 3,500కు పైగా ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 25 లక్షల మంది ప్రేక్షకులు సందర్శించగా.. సంగీతం, నాటకం, నృత్యం, దృశ్యకళ తదితర రంగాలకు చెందిన 10,500 మందికి పైగా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. 15కుపైగా భాషల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం విశేషం.
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లోని గ్రాండ్ థియేటర్ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలకు వేదికగా నిలిచింది. ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్, వెస్ట్ సైడ్ స్టోరీ, మమ్మా మియా, ది ఫ్యాంటమ్ ఆఫ్ ఒపేరా, విక్డ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ ప్రొడక్షన్స్ ఇక్కడ ప్రేక్షకులను అలరించాయి. అదే వేదికపై మొఘల్-ఎ-ఆజమ్: ది మ్యూజికల్, రాజాధిరాజ్: లవ్. లైఫ్. లీలాతో పాటు ఎన్మ్యాక్ ఒరిజినల్ ప్రొడక్షన్ ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్ వంటి భారతీయ ప్రదర్శనలు సైతం ఘనంగా సాగాయి.
స్టూడియో థియేటర్, ది క్యూబ్ వేదికలు చిన్న స్థాయి, ప్రయోగాత్మక ప్రదర్శనలకు ప్రత్యేక స్థానం కల్పించాయి. థియేటర్, సంగీతం, కామెడీ, నృత్యం తదితర విభాగాల్లో హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ సహా పలు భాషల్లో కార్యక్రమాలు నిర్వహించారు.
దృశ్యకళల పరంగా ఎన్మ్యాక్లోని ఆర్ట్ హౌస్ అంతర్జాతీయ కళా ప్రపంచాన్ని ముంబైకి తీసుకొచ్చింది. లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంతో కలిసి వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్, దియా ఆర్ట్ ఫౌండేషన్ సహకారంతో లైట్ ఇన్టు స్పేస్, భక్తి, బల్గరీ సెర్పెంటి ఇన్ఫినిటో వంటి ప్రదర్శనలు నిర్వహించింది. ప్రస్తుతం సెకెండ్ నేచర్ పేరుతో కొనసాగుతున్న ప్రదర్శనలో టీమ్ల్యాబ్, ఎ.ఎ.మురకామి, ఈఎస్ డెవ్లిన్, ర్యాండమ్ ఇంటర్నేషనల్ తదితర కళాకారులు, స్టూడియోల తొమ్మిది భారీ స్థాయి ఇన్స్టాలేషన్లు ఉన్నాయి. ఈ ప్రదర్శన 2027 జనవరి వరకు కొనసాగనుంది.

అంతర్జాతీయ కళా రంగంతో ఎన్మ్యాక్ అనుబంధం ముంబైకే పరిమితం కాలేదు. 61వ వెనిస్ బియన్నాలేలో ఇండియా పెవిలియన్ను ప్రదర్శించేందుకు భాగస్వామ్యం చేయడం ద్వారా భారత సమకాలీన కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశాన్ని కల్పించింది. ఈ కార్యక్రమంలో ఐదుగురు సమకాలీన భారతీయ కళాకారులను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లింది.
ఎన్మ్యాక్ నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ భారతీయ, అంతర్జాతీయ కళా ప్రపంచాల మధ్య ఈ సాంస్కృతిక మార్పిడి మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’ తిరిగి ప్రదర్శితం కానుండగా.. చికాగో రానుంది. అలాగే ఆస్కార్ నామినీ సంగీత దర్శకుడు మ్యాక్స్ రిక్టర్ తొలిసారి భారత్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. దీంతో భారత ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి కళా అనుభవాలను అందించడంతో పాటు, భారతీయ కళలు, కథనాలకు అంతర్జాతీయ వేదిక కల్పించే ఎన్మ్యాక్ పాత్ర మరింత బలోపేతం కానుంది.


