
కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ అర శాతం తగ్గించడాన్ని అవకాశంగా అందిపుచ్చుకుని, ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. పీఎస్బీల రుణ వృద్ధి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో లేదా అంతకు మించిన స్థాయిలో రుణ వృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి సూచించినట్లు వారు వివరించారు. పీఎస్బీల ఆర్థిక పనితీరును సమీక్షించేందుకు ఆయా బ్యాంకుల చీఫ్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ఆర్థిక సమ్మిళితత్వం సాధించేందుకు ప్రభుత్వ పథకాల్లో మరింత మంది కస్టమర్లను చేర్చేందుకు కృషి చేయాలని మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచన
తక్కువ వ్యయాలతో కూడుకున్న డిపాజిట్లను సమీకరించే మార్గాలు అన్వేషించాలని మంత్రి సూచించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం ముద్రా, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన తదితర పథకాల పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 12 పీఎస్బీల మొత్తం లాభం 26 శాతం వృద్ధి చెంది రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది.