బ్యాంకింగ్ వ్యవస్థలోకి 58 కోట్ల మంది
కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: జన్ధన్ ఖాతాల రూపంలో 58 కోట్ల మందికి పైగా ప్రజలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సంక్షేమ పథకాలు, తక్కువ ప్రీమియంకే బీమా రక్షణ, పెన్షన్ ప్రయోజనాలను ఎలాంటి లీకేజీ లేకుండా ప్రజలకు చేరువ చేయడంలో జన్ధన్ పథకం కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. గరీబ్ కల్యాణ్ పథకం ప్రతీ భారతీయుడికి గౌరవం, సాధికారిత, అవకాశాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్నా హామీ అని ప్రకటించారు.
పేదరికం, దారిద్య్రానికి వ్యతిరేకంగా పోరులో భారత్ అంతర్జాతీయంగా గుర్తింపును సాధించినట్టు ఎక్స్ ప్లాట్ఫామ్లో చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం 2014 ఆగస్ట్ 28న ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాలకు ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు ఈ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. జన్దన్ ఖాతాదారుల్లో 56 శాతం మంది మహిళలే కావడం విశేషం. అది కూడా 67 శాతం ఖాతాలు గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ ఖాతాదారులకు ఇప్పటి వరకు వివిధ పథకాల రూపంలో రూ.45 లక్షల కోట్లను ప్రభుత్వం బదిలీ చేసింది.


