భారతదేశంలో ఇథనాల్ వినియోగం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే ఇథనాల్ను వంట గ్యాస్ మాదిరిగా ఉపయోగించుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
భారత్ ఎల్పీజీ వంటగ్యాస్ మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బహుశా ఈ ఏడాది చివరి నాటికి అన్నీ సిద్దమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి తయారయ్యే పరిశుభ్రమైన, పునరుత్పాదక ఇంధనం. ఇప్పటివరకు దీనిని పెట్రోల్లో కలిపి వాహనాల్లో వినియోగిస్తున్నారు. ఇకపై అదే ఇథనాల్ను ప్రత్యేక స్టవ్ల ద్వారా ఇంట్లో వంట చేయడానికి ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఇథనాల్ స్టవ్లు కొనుగోలు చేసే వారికి సబ్సిడీ ఇవ్వడానికి కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇథనాల్ సులభంగా అందుబాటులో ఉండేలా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం.. భవిష్యత్తులో పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక ఇథనాల్ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. వినియోగదారులు పెట్రోల్ బంకుల నుంచే ఇథనాల్ కొనుగోలు చేయవచ్చన్నమాట.
ప్రస్తుతం భారత్లో ఇథనాల్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అయితే అందులో పెద్ద మొత్తంలో వినియోగించకుండా మిగిలిపోతోంది. ఇలా మిగిలిన ఇథనాల్ ఇంధనాన్ని వంట గ్యాస్ కోసం ఉపయోగిస్తే రైతులకు, పరిశ్రమలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: హైడ్రోజన్ రైలుపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రైల్వే!


