
ఆదాయ పన్ను రిటర్నుల స్క్రూటినీ విషయంలో సహేతుకమైన, నిర్దిష్టమైన ప్రశ్నలు వేయాలని, అసంబద్ధమైన ప్రశ్నలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆదాయ పన్ను శాఖ అధికారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) సూచించింది. ఈ విషయాల్లో అసెసింగ్ అధికారులను సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ప్రాంతీయ హెడ్స్కి (ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్స్ – పీసీసీఐటీ) పంపిన లేఖలో సీబీడీటీ చైర్మన్ రవి అగ్రవాల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడు
నోటీసులు, అసెస్మెంట్ ఆర్డర్లు సక్రమంగా ఉండేలా చూసే బాధ్యత ప్రత్యక్షంగా అసెస్మెంట్ యూనిట్ హెడ్స్ (అడిషనల్ లేదా జాయింట్ కమిషనర్లు) మీదే ఉంటుందని అగ్రవాల్ తెలిపారు. పీసీసీఐటీలు మధ్యమధ్యలో అసెసింగ్ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఉండాలని, సూచనలను పునరుద్ఘాటిస్తూ ఉండాలని, నిబంధనలను పాటిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేసేందుకు ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలని సీబీడీటీ పేర్కొంది. స్క్రూటినీ, అసెస్మెంట్ ఆర్డర్ల నాణ్యతకు సంబంధించి నెలవారీ అప్డేట్ ఇవ్వాలని సూచించింది.