
ఈ నెల నుంచే అమల్లోకి..
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలను వెల్లడించే వ్యవధిని రెండు వారాల పాటు తగ్గిస్తూ కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ (ఎంవోఎస్పీఐ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఇకపై 42 రోజుల తర్వాత కాకుండా ప్రతి నెలా 28న ఈ డేటాను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఒకవేళ 28వ తారీఖు గానీ సెలవు రోజు అయితే, మరుసటి పనిదినం నాడు డేటాను ప్రకటిస్తారు. ఇది ఈ నెల (ఏప్రిల్) నుంచే అమల్లోకి వస్తుంది.
ప్రస్తుతం ఎంవోఎస్పీఐ ఐఐపీ డేటాను రిఫరెన్స్ నెల ముగిసిన ఆరు వారాల తర్వాత ప్రతి నెలా 12న విడుదల చేస్తోంది. సాధారణంగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ రికమండేషన్స్ ఫర్ ఐఐపీ (ఐఆర్ఐఐపీ)–2010 ప్రకారం పారిశ్రామికోత్పత్తి తీరుతెన్నులను తెలియజేసే నెలవారీ ఐఐపీ గణాంకాలను రిఫరెన్స్ నెల ముగిసిన 45 రోజుల్లోగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం ఆరు వారాల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగానే ఎంవోఎస్పీఐ 42 రోజుల్లోగా వెల్లడిస్తోంది.