సంక్లిష్ట చక్రంలో సూక్ష్మ రుణ రంగం | Microfinance suffering from high indebtedness, coercive recovery practices | Sakshi
Sakshi News home page

సంక్లిష్ట చక్రంలో సూక్ష్మ రుణ రంగం

Jun 10 2025 6:38 AM | Updated on Jun 10 2025 9:32 AM

Microfinance suffering from high indebtedness, coercive recovery practices

అధిక వడ్డీ రేట్లు, కఠిన వసూళ్ల ప్రక్రియలు 

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రాజేశ్వరరావు 

ముంబై: అధిక రుణ భారం, గరిష్ట వడ్డీ రేట్లు, కఠిన వసూళ్ల ప్రక్రియలతో కూడిన సంక్లిష్ట సైకిల్‌తో సూక్ష్మ రుణ రంగం సతమతమవుతోందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం రాజేశ్వర్‌రావు అన్నారు. ‘అందరికీ ఆర్థిక సేవలు’ అన్న అంశంపై హెచ్‌ఎస్‌బీసీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. సూక్ష్మ రుణాలపై అధిక వడ్డీ రేట్లను ప్రధానంగా ప్రస్తావించారు. జనాభాలో మినహాయింపు వర్గాలకు సంఘటిత ఆర్థిక సేవలను అందించడంలో సూక్ష్మ రుణ రంగం విశ్వసనీయ వేదికగా ఉన్నట్టు పేర్కొన్నారు. 

అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో సూక్ష్మ రుణ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయంటూ.. ఈ విషయంలో కొన్ని సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇటవలి త్రైమాసికాల్లో సూక్ష్మ రుణాలపై వడ్డీ రేట్లు కొంత మోస్తరు స్థాయికి రావడాన్ని గమనించినట్టు చెప్పారు. అయినప్పటికీ వడ్డీ రేట్లు, మార్జిన్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నట్టు తెలిపారు. కొన్ని సంస్థలకు తక్కువ వ్యయాలకే నిధులు లభిస్తున్నప్పటికీ మిగిలిన పరిశ్రమతో పోల్చతే అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అధిక రాబడులను ఇచ్చే సంప్రదాయ వ్యాపారానికి వెలుపలి అవకాశాలపై రుణదాతలు దృష్టి సారించాలని సూచించారు.  

ప్రక్రియలను మెరుగుపరుచుకోవాలి.. 
‘‘సూక్ష్మ రుణ రంగంలో తరచుగా సమస్యలు ఏర్పడడం ఇటీవలి కాలంలో పెరిగింది. ఒక్కో రుణ గ్రహీత బకాయిల భారం పెరిగింది. దీంతో కొన్ని సందర్భాల్లో కఠిన వసూళ్ల ప్రక్రియలు విషాద పరిణామాలకు దారితీస్తున్నాయి’’అని రాజేశ్వరరావు చెప్పారు. ఇలాంటి వాటిని పరిష్కరించుకోవడం భాగస్వాములు అందరి ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా అవసరమని పేర్కొన్నారు. రుణ గ్రహీతలు అధికంగా రుణం తీసుకోవడాన్ని నిరోధించేందుకు వీలుగా నియంత్రిత సంస్థలు తమ క్రెడిట్‌ ఆమోద ప్రక్రియలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. అలాగే, కఠిన రుణ వసూళ్ల ప్రక్రియలను విడిచి పెట్టాలన్నారు. స్థిరమైన, బాధ్యతాయుత విధానంలో సేవలు అందించాలని సూచించారు. ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టించి విక్రయించడాన్ని కూడా రాజేశ్వరరావు ప్రస్తావించారు. ఈ విషయంలో నిబంధనలు తీసుకురావాలా? లేదా అన్నదాన్ని ఆర్‌బీఐ పరిశీలిస్తున్నట్టు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement