ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని తగ్గించొచ్చు | RBI Tighten Inflation Target India GDP Growth Strong Poonam Gupta | Sakshi
Sakshi News home page

ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని తగ్గించొచ్చు

May 6 2026 8:34 AM | Updated on May 6 2026 8:58 AM

RBI Tighten Inflation Target India GDP Growth Strong Poonam Gupta

దేశ జీడీపీ వృద్ధి రేటు బలంగా ఉండడంతోపాటు స్థిరమైన ద్రవ్యోల్బణం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని, నియంత్రిత శ్రేణిని ఆర్‌బీఐ తగ్గించొచ్చని డిప్యూటీ గవర్నర్‌ (డీజీ) పూనమ్‌ గుప్తా తెలిపారు. అంతర్జాతీయ అనుభవాల ఆధారంగా చూస్తే కొంత తక్కువ లక్ష్యాన్ని, మరింత పరిమిత శ్రేణిని నిర్ణయించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ గత ఆరేళ్ల కాలంలో మాదిరి అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఇక మీదటా కొనసాగితే అది సౌలభ్యతను, స్పష్టతను తగ్గించొచ్చన్నారు.

ఆర్‌బీఐతో సంప్రదింపుల అనంతరం కేంద్ర ప్రభుత్వం 2031 మార్చి 31 వరకు ఐదేళ్ల కాలానికి ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా.. ప్రతికూల పరిస్థితుల్లో కనిష్టంగా 2 శాతం, గరిష్టంగా 6 శాతం (ప్లస్, మైనస్‌ 2 శాతం) మించకుండా చూడాలని నిర్దేశించడం గమనార్హం. ఎన్‌సీఏఈఆర్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ పూనమ్‌ గుప్తా మాట్లాడారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఈ లక్ష్యం, పరిమిత శ్రేణిని మార్చడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. ధరల నియంత్రణ, వృద్ధి రేటుపైనే భవిష్యత్తు ద్రవ్యోల్బణం కార్యాచరణ ఆధారపడి ఉంటుందన్నారు. ఇందుకు అంతర్జాతీయ షాక్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు.


ఆర్‌బీఐ డీజీగా జైన్‌ బాధ్యతలు స్వీకరణ

నలుగురు డీజీలకు పోర్ట్‌ఫోలియోల కేటాయింపు

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా (డీజీ) రోహిత్‌ జైన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఫారెక్స్, ఫిన్‌టెక్‌ సహా 10 విభాగాలను ఆయన పర్యవేక్షించనున్నారు. టి.రవి శంకర్‌ స్థానంలో జైన్‌ నియమితులయ్యారు. ఇంతకుముందు వరకు ఆయన ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. మూడేళ్ల కాలానికి డీజీగా జైన్‌ను ప్రభుత్వం నియమించింది. 1991లో ఆయన ఆర్‌బీఐలో చేరడం గమనార్హం. గుజరాత్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ (ఫైనాన్స్‌), ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుంచి ఎంకామ్‌ కోర్సులను పూర్తి చేశారు. 

అందరిలోకి సీనియర్‌ డీజీ అయిన స్వామినాథన్‌ జానకీరామన్‌ 11 విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఇందులో న్యాయ, డీఐసీజీసీ, తనిఖీ తదితర విభాగాలున్నాయి. అలాగే, సమన్వయ వ్యవహరాలను కూడా ఆయనే చూడనున్నారు. మానిటరీ పాలసీ నిర్వహణ సహా ఆరు విభాగాలను పూనమ్‌ గుప్తా పర్యేవేక్షిస్తారు.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Advertisement
 
Advertisement
Advertisement