
దేశంలోని మెట్రో నగరాల్లో రియల్టీ మార్కెట్ను ఉద్దేశిస్తూ ప్రముఖ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ తాను గమనించిన అత్యంత అవినీతి రంగాల్లో రియల్ఎస్టేట్ మార్కెట్ ఒకటని చెప్పారు. ఈ రంగం నల్లధనంతో కుదేలైందని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో వాస్తవ గృహ డిమాండ్ ద్వారా కాకుండా అక్రమ పెట్టుబడి ప్రవాహాల వల్ల పట్టణ ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు.
రిగ్గింగ్ గేమ్
సంపన్న పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ను ఆసరాగా చేసుకొని పన్ను చెల్లించని డబ్బును నిల్వ చేసి కృత్రిమంగా ధరలు పెంచుతున్నట్లు తెలిపారు. సాధారణ ప్రజలను ఉద్దేశించి ‘మీరు వాస్తవంగా రియల్టీ పెరుగుదలను పరిగణించి ఆస్తులు కొనుగోలు చేయడం లేదు. రిగ్గింగ్ గేమ్లో వాటిని కొంటున్నారు’ అని అన్నారు. తన వాదనను మరింత సమర్థించేలా ముంబయిలో 20 శాతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో తొమ్మిది కుటుంబాలదే పైచేయని తెలిపే డేటాను ఎత్తి చూపారు.
ఇదీ చదవండి: లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2 లక్షల బుకింగ్స్
ఖర్చుతో మానసిక సౌకర్యం
స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ మెట్రో నగరాల్లో అద్దె రాబడులు మాత్రం 2–3% వరకు ఉంటున్నాయని చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్ను ఉత్పాదక ఆస్తిగా కాకుండా, అనుమానాస్పద ఆర్థిక స్థితిలోని నెట్టివేస్తుందని తెలిపారు. మెట్రో నగరాల్లో ఇల్లు ఉండడం ఆర్థిక ఖర్చుతో కూడిన మానసిక సౌకర్యాన్ని అందిస్తుందని చెప్పారు.

కొనుగోలుదారులకు సలహాలు..
అద్దె రాబడులు మొత్త ఆస్తి విలువలో ఏటా 4% మించకపోతే కొనుగోలు చేయవద్దని శ్రీవాస్తవ అన్నారు.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేమని సేల్స్ ఒత్తిడికి లోనవ్వకూడదు. ఆర్థికంగా అన్ని చూసుకోవాలి.
మెట్రోలకు బదులుగా టైర్-2, 3 నగరాలపై ఓ లుక్కేయండి.