స్టేడియంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - వైరల్ అవుతున్న మీమ్స్ | Memes Viral On Infosys Narayana Murthy | Sakshi
Sakshi News home page

స్టేడియంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - వైరల్ అవుతున్న మీమ్స్

Feb 4 2025 4:30 PM | Updated on Feb 4 2025 4:58 PM

Memes Viral On Infosys Narayana Murthy

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు 'ఎన్ఆర్ నారాయణ మూర్తి' (NR Narayana Murthy) ముంబైలోని వాంఖడే స్టేడియంలో.. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్ వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పలువురు నెటిజన్లు పనిగంటలపై ప్రస్తావన తీసుకువచ్చారు. మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు.

వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను రాజీవ్ శుక్లా, ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీ వంటి వాటితో పాటు బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్, బ్రిటిష్ వ్యాపారవేత్త మనోజ్ బాదాలే కూడా వీక్షించారు. అయితే వాంఖడేలోని స్టాండ్‌పై కూర్చున్న నారాయణ మూర్తి ఫోటో.. వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు ఎడిట్ చేసిన మీమ్స్ షేర్ చేయడం ప్రారంభించారు.

వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పిన నారాయణ మూర్తి.. మ్యాచ్ చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా అరుదైన దృశ్యం అని ఒకరు కామెంట్ చేశారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు నారాయణ మూర్తిని పిలిచి ఎక్కువ గంటలు పని చేసి ఆదివారం మ్యాచ్‌ చూడమని సలహా ఇచ్చి ఉంటారని మరొకరు అన్నారు. వారాంతాల్లో ఉద్యోగులు మాత్రమే కాదు.. నారాయణ మూర్తి కూడా పని చేయాలి అని ఇంకొకరు అన్నారు.

ఆదివారాల్లో కూడా పనిచేయమని లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు నారాయణ మూర్తి పనిచేయకపోవడం బాధకలిగిస్తోంది.. ఆదివారాల్లో మిమ్మల్ని పని చేయించలేకపోతున్నందుకు నేను చింతిస్తున్నాను. ఆదివారాల్లో మిమ్మల్ని పని చేయించగలిగితే, నేను కూడా ఆదివారాల్లో పని చేస్తాను అని ఓ నెటిజన్ అన్నారు.

వారానికి 70 గంటల పని
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్‌లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పని చేయాలని పేర్కొన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు.

పని గంటలు పెంచకపోతే ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడటం అసాధ్యం అని నారాయణ మూర్తి అన్నారు. తప్పకుండా దీని గురించి యువత ఆలోచించాలి, జర్మన్ దేశంలో ప్రతి వ్యక్తి.. దేశాభివృద్ధి కోసం తప్పనిసరిగా అదనపు పని చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇదే భారతీయులు కూడా పాటించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

వారానికి 90 గంటల పని
ఉద్యోగులు వారంలో 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా విధులకు హాజరుకావాలంటూ ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఇంట్లో కూర్చొని ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ, ఆఫీసులో ఎక్కువగా ఉంటామని భార్యలకు చెప్పాలి. అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయాల.. అని అన్నారు. దీనిపై సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement