
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. నవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్ప వెనకడుగుతో రూ. 3,911 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 3,952 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 38,471 కోట్ల నుంచి రూ. 40,920 కోట్లకు బలపడింది.
మొత్తం వ్యయాలు 8%పైగా పెరిగి రూ. 37,585 కోట్లను తాకాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 135 డివిడెండ్ ప్రకటించింది. ఈ కాలంలో 3% అధికంగా 6,04,635 యూనిట్ల అమ్మకాలు సాధించింది. ఒక క్వార్టర్కు ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం. దేశీ విక్రయాలు 3% వృద్ధితో 5,19,546 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు 8% ఎగసి 85,089గా నమోదయ్యాయి.
పూర్తి ఏడాదికి...
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మారుతీ కన్సాలిడేటెడ్ నికర లాభం 7.5 శాతం పుంజుకుని రూ. 14,500 కోట్లయ్యింది. 2023–24లో రూ. 13,488 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,41,858 కోట్ల నుంచి రూ. 1,52,913 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో మొత్తం 22,34,266 వాహనాలను విక్రయించింది. వెరసి గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధిక విక్రయాలు, ఎగుమతులను నమోదు చేసింది. దేశీయంగా మందగమనం ఉన్నప్పటికీ పటిష్ట ఫలితాలు సాధించినట్లు కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు.