మహీంద్రా కొత్త ప్లాంట్‌ | Mahindra plans new greenfield plant by FY2028 | Sakshi
Sakshi News home page

మహీంద్రా కొత్త ప్లాంట్‌

May 6 2025 12:36 AM | Updated on May 6 2025 8:03 AM

Mahindra plans new greenfield plant by FY2028

2028 నాటికి ఏర్పాటు ప్రణాళిక

క్యూ4లో నికర లాభం రూ. 3,542 కోట్లు; 13 శాతం అప్‌ 

షేరుకు రూ. 25.30 తుది డివిడెండ్‌

ముంబై/న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (2024–25, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 13.3% ఎగబాకి రూ.3,542 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,125 కోట్లుగా నమోదైంది.

 మొత్తం ఆదాయం రూ.35,373 కోట్ల నుంచి రూ.42,586 కోట్లకు పెరిగింది. 20% వృద్ధి చెందింది. వాహన, వ్యవసాయ పరికరాల విభాగాల మెరుగైన పనితీరు ఇందుకు దోహదం చేసినట్లు మహీంద్రా గ్రూప్‌ ఎండీ, సీఈఓ అనీష్‌ షా చెప్పారు. కాగా, క్యూ4లో కంపెనీ 18 శాతం పెరుగుదలతో మొత్తం 2.53 లక్షల వాహనాలను విక్రయించింది. ఇందులో ఎస్‌యూవీలు 1.49 లక్షలుగా ఉన్నాయి. 

కొత్త ప్లాంట్‌... 
ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) తయారీ కోసం కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2028 మార్చి నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించవచ్చని అంచనా. ‘మేము భవిష్యత్తు తరం వాహనాల నిమిత్తం ఒక కొత్త ప్లాంట్‌ను నెలకొల్పనున్నాం. ప్రధానంగా పీవీల కోసం ప్రణాళిక రూపొందిస్తున్నప్పటికీ.. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర ప్రత్యేక వాహనాలను కూడా జత చేసే అవకాశం ఉంది. ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. 

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం’ అని మహీంద్రా సీఈఓ (ఆటోమోటివ్, వ్యవసాయ పరికరాలు) రాజేష్‌ జెజూరికర్‌ పేర్కొన్నా రు. కాగా, చకన్‌ (పుణే)లో అదనంగా 1.2 లక్షల వార్షిక  తయారీ సామర్థ్యాన్ని జత చేసేలా కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు  ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్‌ 15న దీన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. ఎక్స్‌యూవీ3ఎక్స్‌ఓ, థార్‌ రాక్స్‌ తయారీ సామర్థ్యాన్ని 2025–26లో 3,000 మేర పెంచుతామని వెల్లడించారు. 

పూర్తి ఏడాదికి... 
మార్చితో ముగిసిన 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.14,073 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది లాభం రూ.12,270 కోట్లతో పోలిస్తే 15 శాతం ఎగసింది. మొత్తం ఆదాయం కూడా 15 శాతం వృద్ధితో రూ.1,38,279 కోట్ల నుంచి రూ.1,58,750 కోట్లకు చేరింది. కాగా, ఒక్కో షేరుకు రూ.25.30 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 

ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్‌ఎం షేరు బీఎస్‌ఈలో 3 శాతం ఎగసి రూ.3,021 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 11,322 కోట్లు ఎగసి రూ.3,72,720 కోట్లకు చేరింది.  

Advertisement
 
Advertisement
Advertisement