భారత లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో కళ్లు చెదిరే ఖరీదైన డీల్ నమోదైంది. ప్రముఖ ఇన్వెస్టర్ మధుసూదన్ మురళీధర్ కేలా.. డీఎల్ఎఫ్ అత్యంత విలాసవంతమైన నివాస ప్రాజెక్ట్ ‘ది దహ్లియాస్’లో ఒక అపార్ట్మెంట్ను రూ.120.71 కోట్లకు కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ డేటా సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ పరిశీలించిన రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ ఒప్పందం ఏప్రిల్ 15, 2026న నమోదైంది. అపార్ట్మెంట్ విస్తీర్ణం 6,233 చదరపు అడుగులు కాగా, ఐదు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.
హర్యానాలోని గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్లో ఉన్న సెక్టార్–54 ప్రాంతం దేశంలోనే అత్యంత ప్రీమియం నివాస కేంద్రాల్లో ఒకటిగా ఎదుగుతోంది. డీఎల్ఎఫ్ సిటీ ఫేజ్–5లో అభివృద్ధి చేస్తున్న ‘ది దహ్లియాస్’ ప్రాజెక్ట్ ఇప్పటికే దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, అధిక సంపన్నుల దృష్టిని ఆకర్షిస్తోంది. చదరపు అడుగుకు దాదాపు రూ.1.9 లక్షలకుపైగా విలువతో జరిగిన ఈ డీల్ గురుగ్రామ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త రికార్డుగా నిలిచింది.
స్టాక్ మార్కెట్లో కింగ్.. కేలా
స్టాక్ మార్కెట్లో ప్రముఖ ఇన్వెస్టర్గా పేరుగాంచిన కేలా (Madhusudan Kela) , ప్రస్తుతం పలు లిస్టెడ్ కంపెనీల్లో గణనీయమైన వాటాలు కలిగి ఉన్నారు. తాజా షేర్హోల్డింగ్ వివరాల ప్రకారం, ఆయన పెట్టుబడుల మార్కెట్ విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు ఆయన లగ్జరీ రియల్ ఎస్టేట్లో చేసిన భారీ పెట్టుబడి, సంపన్న వర్గాలు నివాస ఆస్తులను కేవలం విలాసానికి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనంగా కూడా చూస్తున్నాయనే ధోరణిని మరోసారి స్పష్టం చేసింది.
డీఎల్ఎఫ్ 2024 అక్టోబర్లో ప్రారంభించిన 17 ఎకరాల ‘ది దహ్లియాస్’ ప్రాజెక్ట్లో మొత్తం 420 అపార్ట్మెంట్లు, పెంట్హౌస్లు ఉన్నాయి. కంపెనీ తాజా వివరాల ప్రకారం, ఇప్పటివరకు ప్రాజెక్ట్లో దాదాపు 60 శాతం యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.18,500 కోట్లకుపైగా అమ్మకాలు నమోదయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్ ఆదాయ సామర్థ్యం రూ.40,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
విస్తరిస్తున్న అల్ట్రా-లగ్జరీ హౌసింగ్
భారత్లో అల్ట్రా-లగ్జరీ హౌసింగ్ విభాగం గత రెండేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గురుగ్రామ్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రూ.10 కోట్లకు పైబడిన గృహాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. పరిమిత సరఫరా, ప్రీమియం లొకేషన్లు, అధిక సంపన్నుల పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇటువంటి ప్రాజెక్ట్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మధుసూదన్ కేలా తాజా కొనుగోలు కూడా అదే ధోరణికి నిదర్శనంగా నిలిచింది.


