2017 నుంచి 2026 వరకూ క్రిసిల్ నివేదిక
ముంబై: ఇతర కంపెనీల కొనుగోళ్లలో దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ ఆసక్తి చూపుతున్నట్లు దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే కొనుగోళ్లు రెట్టింపైనట్లు వెల్లడించింది. అయితే వీటిలో మూడోవంతు అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినట్లు తెలియజేసింది. విభిన్న కారణాలతో కంపెనీలు ఇతర సంస్థల కొనుగోళ్లను చేపడుతున్నట్లు క్రిసిల్ ఎండీ సుబోధ్ రాయ్ తెలియజేశారు.
వృద్ధిని పెంచుకోవడంలో వేగం, మార్కెట్లలో మరింత విస్తరించడం, కొనుగోళ్ల సామర్థ్యాలకు పదును పెట్టుకోవడం తదితరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. నివేదిక విశ్లేషణ ప్రకారం 2017 నుంచి డీల్స్ సంఖ్య రెట్టింపైంది. 20 రంగాల నుంచి విడిగా రూ. 500 కోట్లకుపైగా విలువైన 600 డీల్స్ను నివేదిక విశ్లేషించింది. అయితే విశ్లేషణలో ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరీ్వసుల రంగాలలోని లావాదేవీలను మినహాయించింది. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) దిగ్గజాలు దేశీయంగా చేపట్టే డీల్స్కు సైతం చోటివ్వలేదు.
కారణాలు వేరువేరు..
క్రిసిల్ నివేదిక ప్రకారం ఫార్మాస్యూటికల్స్, హెల్త్కేర్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్జూమర్ బిజినెస్లు టెక్నాలజీల అనుసంధానం, నైపుణ్యాలు, మేథోసంపత్తిని సమకూర్చుకోవడం తదితరాల కోసం కొనుగోళ్లను చేపడుతున్నాయి. సిమెంట్, మెటల్స్ రంగాలలోని పరిశ్రమలు.. కన్సాలిడేషన్, ప్లాంట్ల నిర్మాణ సమయాన్ని తగ్గించుకోవడం తదితరాలపై దృష్టితో కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. తద్వారా 4–6 ఏళ్ల కాలాన్ని ఏడాది నుంచి మూడేళ్లకు తగ్గించుకుంటున్నాయి.
రుణ సమీకరణతో చేపట్టిన 100కుపైగా భారీ డీల్స్ మూడింటిలో రెండు అంచనాలను అందుకున్నట్లు రాయ్ పేర్కొన్నారు. కొన్ని డీల్స్ ఏకీకృతంకావడంలో విఫలంకాగా.. నియంత్రణ సంస్థల ఆలస్యాలు, దేశ సరిహద్దులనుదాటి(క్రాస్బోర్డర్) చేపట్టే కొనుగోళ్లు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించారు. కొనుగోళ్లు, విలీనాలనేవి వ్యూహాత్మక నిర్ణయాలతోనే విజయవంతంకాబోవని, క్రమశిక్షణాయుత ఏకీకృత చర్యలు, సమయానుగుణంగా సొంతం చేసుకోవడం, వనరుల సమర్థవంత వినియోగం తదితరాలు ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడ్డారు.


