ఎంజీ హెక్టార్‌ ‘తొమాహాక్‌’ వచ్చేసింది | JSW MG Motor India launches MG Hector Tomahawk in EV, PHEV | Sakshi
Sakshi News home page

ఎంజీ హెక్టార్‌ ‘తొమాహాక్‌’ వచ్చేసింది

Aug 27 2026 6:06 AM | Updated on Aug 27 2026 6:06 AM

JSW MG Motor India launches MG Hector Tomahawk in EV, PHEV

ఈవీ, ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ వెర్షన్లలో ఆవిష్కరణ 

రూ.6,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు  

ఏటా 35–40 శాతం వార్షిక వృద్ధి రేటు లక్ష్యం

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ సంస్థ ‘జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా’ భారత మార్కెట్లోకి నూతన మల్టీ–ఎనర్జీ వెహికల్‌ ‘హెక్టార్‌ తొమాహాక్‌’ ను అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన ‘అడ్వాన్స్‌డ్‌ డ్రైవ్‌ ఆర్కిటెక్చర్‌ ప్లాట్‌ఫామ్‌ టెక్నాలజీ (ఏడీఏపీటీ)’ పై రూపొందిన తొలి మోడల్‌ ఇదేనని తెలిపింది. అలాగే, భారత్‌లో న్యూ ఎనర్జీ వెహికల్‌ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన తొలి ఉత్పత్తిగా కూడా పేర్కొంది. ఎక్స్‌ షోరూం వద్ద ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) వెర్షన్‌ ప్రారంభ ధర రూ.19.49 లక్షలుగా ఉంది. ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ (పీహెచ్‌ఈవీ) వెర్షన్‌ ధర రూ. 25.70 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 

కారు ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ డైరెక్టర్‌ పార్థ్‌ జిందాల్‌ మాట్లాడుతూ విస్తరణ ప్రణాళికలను వెల్లడించారు. ‘‘దేశంలో తమ తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు కంపెనీ, దాని భాగస్వామ్య వెండర్లు కలిసి రూ.6,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నాము’’ అని తెలిపారు. ఇందులో కంపెనీ వాటా రూ.3,500 కోట్లు కాగా, వెండర్లు దాదాపు రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత విస్తరణ ప్రణాళికకు అవసరమైన నిధులు కంపెనీ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

హలోల్‌ ప్లాంట్‌ విస్తరణకు భారీ ప్రణాళిక
 మొత్తం రూ.6 వేల కోట్ల పెట్టుబడిలో కొంత భాగాన్ని గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హలోల్‌ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.10 లక్షల యూనిట్లుగా ఉందని, వచ్చే ఏడాది మార్చి నాటికి దీనిని 1.60 లక్షల యూనిట్లకు, 2028 జనవరి నాటికి 2.20 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు వివరించారు. రాబోయే 3–4 ఏళ్లలో కొత్త ప్రాంతంలో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న హలోల్‌ ప్లాంట్‌లోనే వార్షిక సామర్థ్యాన్ని 4 లక్షల యూనిట్ల వరకు పెంచుకునే అవకాశం ఉందన్నారు. 

భారీ వృద్ధి లక్ష్యాలు 
కంపెనీ ఏటా 35–40 శాతం వార్షిక వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుందని పార్థ్‌ జిందాల్‌ చెప్పారు. మార్కెట్‌లో డిమాండ్‌ కంటే సరఫరా తక్కువగా ఉండటమే ప్రధాన సవాలు అన్నారు. గతేడాది 71,000 కార్లను విక్రయించగా, ఈ ఏడాది 1,00,000 కార్ల విక్రయాల మార్కును దాటతామనే ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లో బ్యాటరీ సెల్స్‌ తయారీపై కంపెనీ ఆసక్తి చూపుతున్నప్పటికీ, లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ (ఎల్‌ఎఫ్‌పీ) టెక్నాలజీ చైనా వెలుపల పరిమితంగా అందుబాటులో ఉందన్నారు. అయితే బ్యాటరీ స్టోరేజ్‌ కోసం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీకి, ఎంజీ వాహనాల కోసం సెల్‌–టు–ప్యాక్‌ సదుపాయాలను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు.  

వాటా కొనుగోలుపై చర్చలు 
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియాలో అదనపు వాటా కొనుగోలుపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, ఎస్‌ఏఐసీ మోటార్‌ మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ అంశంపై ఇప్పటివరకు ఎ లాంటి నిర్ణయం తీసుకోలేదని పార్థ్‌ జిందాల్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం కంపెనీలో ఎస్‌ఏఐసీ మోటార్‌కు 49%, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు 35% వాటా ఉండగా, మిగిలిన వాటాను ఇతర భారతీయ పెట్టుబడిదారులు, డీలర్లు, ఉద్యోగులు కలి గి ఉన్నారు. భారత్‌ను తమ తదుపరి కీలక వృద్ధి మార్కెట్‌గా ఎస్‌ఏఐసీ మోటార్‌ చూస్తోందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement