న్యూఢిల్లీ: దేశీయంగా అల్యూమినియం ఉత్పత్తి విభాగంలో పోటీ తీవ్రతరమవుతోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ 11.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రతిపాదించగా, తాజాగా మరో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఎంట్రీ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఒడిస్సాలోని కర్లాపట్ బాక్సైట్ బ్లాక్ టెండర్ డాక్యుమెంట్లను కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 3,100 హెక్టార్లలో విస్తరించిన ఈ బ్లాకులో 200 మిలియన్ టన్నులకు పైగా బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు అంచనా. వాస్తవానికి రిలయన్స్, అదానీ గ్రూప్ తదితర కంపెనీలు దీనిపై ఆసక్తిగా ఉన్నప్పటికీ 175 శాతం ప్రీమియంను ఆఫర్ చేయడం ద్వారా వేదాంత అల్యూమినియం అనుబంధ సంస్థ బాల్కో ప్రిఫర్డ్ బిడ్డరుగా నిలిచింది.
కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు దన్ను..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే తొలి సమగ్ర అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంటును చేపడుతోంది. వచ్చే 30 ఏళ్లలో దీనిపై రూ. 2.73 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. అల్యూమినియం పరిశ్రమలో శుద్ధి, స్మెలి్టంగ్ తదితర ప్రక్రియలకు చాలా భారీ స్థాయిలో విద్యుత్ అవసరమవుతుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల్లో బొగ్గును సింథసిస్ గ్యాస్ (సిన్గ్యాస్)గా మార్చి, విద్యుత్తును ఉత్పత్తిచేసేందుకు లేదా పారిశ్రామిక ఇంధనంగాను ఉపయోగిస్తారు.
లోహాల మార్కెట్లో ఎంట్రీకి దీన్నొక అవకాశంగా మల్చుకోవాలని రిలయన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ను లోహాల తయారీకి ఉపయోగించుకోవడం ద్వారా లాభదాయకతను పెంచుకోవచ్చనే ఆలోచనతోనే అల్యూమినియంపై కంపెనీ దృష్టి పెడుతుండవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కోల్ గ్యాసిఫికేషన్ను భారీ స్థాయి లోహాలు, ఖనిజాల ప్రాసెసింగ్ కోసం వినియోగించుకునేందుకు అవకాశం ఉందని వివరించాయి. అయితే, కంపెనీ ఇంకా అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని, ఇంకా ఏదీ ధృవీకరణ కాలేదని వివరించాయి.
ఇప్పటికే భారీగా ఉత్పత్తి...
ఇప్పటికే అల్యూమినియం రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం బోలెడంత ఉన్న తరుణంలో మరో రెండు దిగ్గజాలు కూడా బరిలోకి దిగనుండటంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం 25 లక్షల టన్నుల వార్షిక తయారీ సామర్థ్యంతో వేదాంత అల్యూమినియం ప్రస్తుతం భారత్లో అతి పెద్ద ఉత్పత్తి సంస్థగా కార్యకలాపాలు సాగిస్తోంది.
ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్ ఉత్పత్తి సామర్థ్యం 14 లక్షల టన్నులుగా ఉండగా, ప్రభుత్వ రంగ నాల్కో సామర్థ్యం 5 లక్షల టన్నులుగా ఉంది. ఈ పరిస్థితుల్లో యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీతో కలిసి ఒడిశాలో 20 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్య అల్యూమినియం ప్రాజెక్టును చేపడుతున్నట్లు, ఇందుకోసం 11.5 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ జూలైలో ప్రకటించడం గమనార్హం.


