భారత్ వైపు జపాన్ చూపు: 2030 నాటికి.. | Japanese Automobile Companies Invest In India 11 Billion Dollars | Sakshi
Sakshi News home page

భారత్ వైపు జపాన్ చూపు: 2030 నాటికి..

Nov 8 2025 2:45 PM | Updated on Nov 8 2025 3:58 PM

Japanese Automobile Companies Invest In India 11 Billion Dollars

భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ కేవలం దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు కూడా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఈ తరుణంలో జపనీస్ ఆటో దిగ్గజాలైన టయోటా, హోండా, సుజుకి దేశీయ విఫణిలో ఏకంగా 11 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్దమయ్యాయి. ఇది దేశంలోని అతిపెద్ద విదేశీ పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది.

ప్రపంచ వాహన తయారీదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో.. ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని ఎంచుకుంటున్నాయి. ఇండియా కేవలం తయారీకి మాత్రమే కాకుండా.. ఎగుమతికి కూడా అనువైన దేశం కావడంతో చాలా దేశాల చూపు మనదేశంపై పడింది. అంతే కాకుండా ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లో ఖర్చులు కొంత తక్కువగా ఉంటాయి. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, మద్దతు ఇచ్చే ప్రభుత్వ విధానాలు విదేశీ కంపెనీలను ఆకట్టుకుంటున్నాయి.

  • భారతదేశ కార్ల మార్కెట్లో దాదాపు 40 శాతం వాటా ఉన్న సుజుకి, ఏటా 40 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయడానికి 8 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది.

  • టయోటా కంపెనీ కూడా 3 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. హైబ్రిడ్ కాంపోనెంట్ సరఫరా గొలుసును విస్తరించాలని, మహారాష్ట్రలో కొత్త ప్లాంట్‌ను నిర్మించాలని యోచిస్తోంది.

  • హోండా కంపెనీ కూడా.. భారతదేశాన్ని ఎగుమతి స్థావరంగా చేసుకోబోతున్నట్లు.. ఇక్కడ నుంచే జీరో సిరీస్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకదాన్ని ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది.

చైనాకు దూరం!
2021 నుంచి భారతదేశ ఆటోమొబైల్ రంగంలో జపాన్ పెట్టుబడులు ఏడు రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో చైనాకు నిధులను 80 శాతం కంటే ఎక్కువ తగ్గించాయి. చైనా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో.. ధరలు పెరిగిపోవడం వల్ల, కంపెనీలకు వచ్చే లాభాలు క్రమంగా తగ్గిపోయాయి. ఈ కారణంగానే చైనాకు.. జపాన్ పెట్టుబడులు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.

వేగం పెంచిన టయోటా & సుజుకి
టయోటా 2030 నాటికి.. భారతదేశంలో 15 కొత్త లేదా అప్డేటెడ్ మోడళ్లను లాంచ్ చేయాలని యోచిస్తోంది. దీంతో తన మార్కెట్ వాటాను 8 నుండి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ పెడుతున్న పెట్టుబడులు.. వాహనాల ఉత్పత్తిని మరో 10 లక్షలు పెంచుతాయి.

సుజుకి కూడా భారతదేశాన్ని తన ప్రపంచ ఎగుమతి స్థావరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ & అంతర్జీతీయ మార్కెట్లలో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే.. సుజుకి యొక్క ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామని కంపెనీ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి అన్నారు.

ఇదీ చదవండి: 42 ఏళ్లు.. ఇండియాలో మూడు కోట్ల సేల్స్!

హోండా కంపెనీ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచే యోచనలో ఉంది. హోండాకు, భారతదేశం దాని ప్రపంచ కార్ల వ్యూహంలో కేంద్రంగా మారుతోంది. ఇండియా ఇప్పుడు అమెరికా, జపాన్‌లతో పాటు హోండా యొక్క టాప్ మూడు కార్ల మార్కెట్లలో ఒకటిగా ఉందని సీఈఓ తోషిహిరో మిబే పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement