breaking news
Japanese companies
-
భారత్ వైపు జపాన్ చూపు: 2030 నాటికి..
భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ కేవలం దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు కూడా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఈ తరుణంలో జపనీస్ ఆటో దిగ్గజాలైన టయోటా, హోండా, సుజుకి దేశీయ విఫణిలో ఏకంగా 11 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్దమయ్యాయి. ఇది దేశంలోని అతిపెద్ద విదేశీ పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది.ప్రపంచ వాహన తయారీదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో.. ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని ఎంచుకుంటున్నాయి. ఇండియా కేవలం తయారీకి మాత్రమే కాకుండా.. ఎగుమతికి కూడా అనువైన దేశం కావడంతో చాలా దేశాల చూపు మనదేశంపై పడింది. అంతే కాకుండా ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్లో ఖర్చులు కొంత తక్కువగా ఉంటాయి. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, మద్దతు ఇచ్చే ప్రభుత్వ విధానాలు విదేశీ కంపెనీలను ఆకట్టుకుంటున్నాయి.భారతదేశ కార్ల మార్కెట్లో దాదాపు 40 శాతం వాటా ఉన్న సుజుకి, ఏటా 40 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయడానికి 8 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది.టయోటా కంపెనీ కూడా 3 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. హైబ్రిడ్ కాంపోనెంట్ సరఫరా గొలుసును విస్తరించాలని, మహారాష్ట్రలో కొత్త ప్లాంట్ను నిర్మించాలని యోచిస్తోంది.హోండా కంపెనీ కూడా.. భారతదేశాన్ని ఎగుమతి స్థావరంగా చేసుకోబోతున్నట్లు.. ఇక్కడ నుంచే జీరో సిరీస్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకదాన్ని ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది.చైనాకు దూరం!2021 నుంచి భారతదేశ ఆటోమొబైల్ రంగంలో జపాన్ పెట్టుబడులు ఏడు రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో చైనాకు నిధులను 80 శాతం కంటే ఎక్కువ తగ్గించాయి. చైనా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో.. ధరలు పెరిగిపోవడం వల్ల, కంపెనీలకు వచ్చే లాభాలు క్రమంగా తగ్గిపోయాయి. ఈ కారణంగానే చైనాకు.. జపాన్ పెట్టుబడులు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.వేగం పెంచిన టయోటా & సుజుకిటయోటా 2030 నాటికి.. భారతదేశంలో 15 కొత్త లేదా అప్డేటెడ్ మోడళ్లను లాంచ్ చేయాలని యోచిస్తోంది. దీంతో తన మార్కెట్ వాటాను 8 నుండి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ పెడుతున్న పెట్టుబడులు.. వాహనాల ఉత్పత్తిని మరో 10 లక్షలు పెంచుతాయి.సుజుకి కూడా భారతదేశాన్ని తన ప్రపంచ ఎగుమతి స్థావరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ & అంతర్జీతీయ మార్కెట్లలో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే.. సుజుకి యొక్క ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామని కంపెనీ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి అన్నారు.ఇదీ చదవండి: 42 ఏళ్లు.. ఇండియాలో మూడు కోట్ల సేల్స్!హోండా కంపెనీ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచే యోచనలో ఉంది. హోండాకు, భారతదేశం దాని ప్రపంచ కార్ల వ్యూహంలో కేంద్రంగా మారుతోంది. ఇండియా ఇప్పుడు అమెరికా, జపాన్లతో పాటు హోండా యొక్క టాప్ మూడు కార్ల మార్కెట్లలో ఒకటిగా ఉందని సీఈఓ తోషిహిరో మిబే పేర్కొన్నారు. -
జపాన్ సహకారంతో వేదాంత సెమీకండక్టర్ ప్లాంట్!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెమీకండక్టర్ ప్లాంటు కోసం జపాన్ టెక్నాలజీ కంపెనీలతో సహకారాన్ని అన్వేషిస్తున్నట్లు వేదాంత గ్రూప్ తెలిపింది. గుజరాత్లో సెమీకండక్టర్ ఫ్యాబ్ను నెలకొల్పుతున్నట్టు వేదాంత ఇప్పటికే ప్రకటించింది. జపాన్లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ రోడ్షో సందర్భంగా వేదాంత సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్ గ్లోబల్ ఎండీ ఆకర్ష్ కె హెబ్బార్ మాట్లాడారు. గుజరాత్లోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలకు ఇది 80 బిలియన్ డాలర్ల అవకాశం అని చెప్పారు. దేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ను నిర్మించడంలో సహాయం చేయడానికి భాగస్వామ్యం కావాలని జపాన్ కంపెనీలను ఈ సందర్భంగా ఆహ్వానించినట్టు వేదాంత తెలిపింది. భారత సెమీకండక్టర్, గ్లాస్ డిస్ప్లే తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి వేదాంత గ్రూప్నకు చెందిన అవన్స్ట్రేట్ ఇంక్ గత ఏడాది చివర్లో 30 జపనీస్ టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. -
భారత్కు జపాన్ ఫార్మా కంపెనీలు
భాగస్వామ్యానికి ఇక్కడి కంపెనీలు సిద్ధం ఫార్మాక్సిల్ డెరైక్టర్ జనరల్ అప్పాజీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయ ఔషధ రంగంలో జపాన్ కంపెనీలు అడుగుపెట్టబోతున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఏడాదిలో ఇది కార్యరూపంలోకి రానుంది. భారత ఔషధ ఎగుమతులను ప్రోత్సహిస్తున్న ఫార్మాక్సిల్... కొన్నేళ్లుగా జపాన్ దిగ్గజ ఫార్మా సంస్థలతోపాటు ఒసాకా ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్తోనూ ఈ విషయమై చర్చిస్తోంది. జపాన్ సంస్థల ప్రతినిధులు భారత్లోని పలు కంపెనీలను సందర్శించారు కూడా. జపాన్కు చెందిన 30 కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఫార్మాక్సిల్ డెరైక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ చెప్పారు. యూబీఎం ఆధ్వర్యంలో బుధవారమిక్కడ ప్రారంభమైన ఫార్మాలిటికా ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. అక్కడి కంపెనీలతో తదుపరి చర్చలు ఈ నెలలోనే ఉన్నాయన్నారు. భారత కంపెనీలతో జాయింట్ వెంచర్లకు ఆస్కారం ఉందన్నారు. జీవీకే అంశంపై వారంలో నిర్ణయం.. హైదరాబాద్కు చెందిన జీవీకే బయో క్లినికల్ పరీక్షలతో సంబంధం ఉన్న 700 ఔషధాలను యూరోపియన్ యూనియన్ కొద్ది రోజుల క్రితం నిషేధించింది. ఈయూ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న కేంద్ర ప్రభుత్వం... ప్రతిపాదిత భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను వాయిదా వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జీవీకే-ఈయూ వివాదంపై తదుపరి కార్యాచరణకు సంబంధించి వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందని అప్పాజీ వెల్లడించారు. ఈయూ బ్యాన్తో భారతీయ కంపెనీలు రూ.3,250 కోట్ల విలువైన వ్యాపారం కోల్పోతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రూ.700 కోట్లతో మూడు ప్లాంట్లు.. అరబిందో ఫార్మా కొత్తగా మూడు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. వీటిలో నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద ఓరల్ సాలిడ్ ఫినిష్డ్ డోసేజెస్ ప్లాంటు ఒకటి. యూరోపియన్ మార్కెట్ల కోసం విశాఖపట్నం జిల్లాలో ఓరల్ ఫినిష్డ్ డోసేజెస్ యూనిట్ స్థాపించనుంది. అలాగే సెమి సింథటిక్ పెన్సిలిన్ ప్లాంటు హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల వద్ద నెలకొల్పుతోంది. ఈ మూడు గ్రీన్ఫీల్డ్ ప్లాంట్లకు రూ.700 కోట్లు ఖర్చు చేయనున్నట్టు అరబిందో ఫార్మా హోల్టైమ్ డెరైక్టర్ మదన్మోహన్రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఏపీఐ ప్లాంట్ల విస్తరణకు రూ.200 కోట్లు పెట్టుబడిగా వెచ్చించనున్నట్లు ఆయన వెల్లడిం చారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో శంషాబాద్-జడ్చర్ల మార్గంలో ఫార్మెక్సిల్ భారీ ఎగ్జిబిషన్ కేంద్రం ఏర్పాటు కానుంది. -
బాబూ.. విదేశీ మైండ్సెట్ వద్దు
వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘ఏపీలో మరో జపాన్ను సృష్టిస్తానని, రాష్ట్రాన్ని సింగపూర్లా తయారు చేస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు.. విదేశీ మైండ్సెట్(ఆలోచన) నుంచి తెలుగు ప్రజల మైండ్సెట్లోకి రావాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. తెలుగు రాష్ట్రంలో మరో జపాన్ను సృష్టించేందుకు అక్కడి కంపెనీలన్నీ సిద్ధమయ్యాయని చంద్రబాబు భజన పత్రికల్లో వచ్చిన వార్తలను అంబటి ఉటంకించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. మార్చిలో జపాన్ కంపెనీలు రాజధాని ప్రాంతంలో పర్యటించి భారీగా పెట్టుబడులు పెడతాయని, 5 లక్షల ఉద్యోగాలు తాము కల్పిస్తామని జపాన్ మంత్రి ఒకరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయని అంబటి అన్నారు. అక్కడి నుంచి కంపెనీలు వచ్చి ఇక్కడి వారికి ఉద్యోగాలిస్తే తమ పార్టీ సంతోషిస్తుందని అయితే జపాన్ కంపెనీలు వచ్చి ఉద్యోగాలిస్తే తప్ప ఏపీ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. బాబు గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా రూ.కోట్లు ఖర్చు పెట్టి ఐదు సార్లు భాగస్వామ్య సదస్సులు నిర్వహించడమే కాక 7 సార్లు దావోస్లో పర్యటించి కూడా ఇలాంటి కబుర్లే చంద్రబాబు చెప్పారన్నారు. ఆచరణలో చూస్తే ఆయన చెప్పిన దాంట్లో 2 శాతం కూడా పెట్టుబడులు రాలేదన్నారు. మన రాష్ట్రంలో నిష్ణాతులైన పారిశ్రామిక వేత్తలుండగా జపాన్ పారిశ్రామిక వేత్తల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. ఆందోళనలో విద్యార్థులు.. గ్రూప్ 1, 2 పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాల భర్తీ జరగదేమోనన్న ఆందోళనతో ఉన్నారని అంబటి అన్నారు. తాము చెప్పే వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయొద్దని సర్వీస్ కమిషన్కు తాఖీదు నివ్వడం దారుణమని.. వెంటనే ఖాళీగా ఉన్న 1.5 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


