బాబూ.. విదేశీ మైండ్‌సెట్ వద్దు | Ambati Rambabu Comments on CM Chandrababu | Sakshi
Sakshi News home page

బాబూ.. విదేశీ మైండ్‌సెట్ వద్దు

Feb 19 2015 2:49 AM | Updated on Oct 4 2018 8:09 PM

బాబూ.. విదేశీ మైండ్‌సెట్ వద్దు - Sakshi

బాబూ.. విదేశీ మైండ్‌సెట్ వద్దు

‘ఏపీలో మరో జపాన్‌ను సృష్టిస్తానని, రాష్ట్రాన్ని సింగపూర్‌లా తయారు చేస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు..

వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘ఏపీలో మరో జపాన్‌ను సృష్టిస్తానని, రాష్ట్రాన్ని సింగపూర్‌లా తయారు చేస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు.. విదేశీ మైండ్‌సెట్(ఆలోచన) నుంచి తెలుగు ప్రజల మైండ్‌సెట్‌లోకి రావాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. తెలుగు రాష్ట్రంలో మరో జపాన్‌ను సృష్టించేందుకు అక్కడి కంపెనీలన్నీ సిద్ధమయ్యాయని చంద్రబాబు భజన పత్రికల్లో వచ్చిన వార్తలను అంబటి ఉటంకించారు.

ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. మార్చిలో జపాన్ కంపెనీలు రాజధాని ప్రాంతంలో పర్యటించి భారీగా పెట్టుబడులు పెడతాయని, 5 లక్షల ఉద్యోగాలు తాము కల్పిస్తామని జపాన్ మంత్రి ఒకరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయని అంబటి అన్నారు. అక్కడి నుంచి కంపెనీలు వచ్చి ఇక్కడి వారికి ఉద్యోగాలిస్తే తమ పార్టీ సంతోషిస్తుందని అయితే జపాన్ కంపెనీలు వచ్చి ఉద్యోగాలిస్తే తప్ప ఏపీ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

బాబు గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా రూ.కోట్లు ఖర్చు పెట్టి ఐదు సార్లు భాగస్వామ్య సదస్సులు నిర్వహించడమే కాక 7 సార్లు దావోస్‌లో పర్యటించి కూడా ఇలాంటి కబుర్లే చంద్రబాబు చెప్పారన్నారు. ఆచరణలో చూస్తే ఆయన చెప్పిన దాంట్లో 2 శాతం కూడా పెట్టుబడులు రాలేదన్నారు. మన రాష్ట్రంలో నిష్ణాతులైన పారిశ్రామిక వేత్తలుండగా జపాన్ పారిశ్రామిక వేత్తల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని సూటిగా ప్రశ్నించారు.
 
ఆందోళనలో విద్యార్థులు..
గ్రూప్ 1, 2 పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాల భర్తీ జరగదేమోనన్న ఆందోళనతో ఉన్నారని అంబటి అన్నారు. తాము చెప్పే వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయొద్దని సర్వీస్ కమిషన్‌కు తాఖీదు నివ్వడం దారుణమని.. వెంటనే ఖాళీగా ఉన్న 1.5 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement