చిన్నగానే చుట్టేసొద్దాం.. | Weak rupee pushes Indians to shorter winter trips: Dubai and Vietnam emerge as top picks | Sakshi
Sakshi News home page

చిన్నగానే చుట్టేసొద్దాం..

Dec 24 2025 2:31 AM | Updated on Dec 24 2025 2:31 AM

Weak rupee pushes Indians to shorter winter trips: Dubai and Vietnam emerge as top picks

శీతాకాలపు విదేశీ విహారయాత్రలపై మారుతున్న ధోరణి 

కరెన్సీ క్షీణత, వ్యయాలు పెరగడమే కారణం 

దుబాయ్, వియత్నాంకి డిమాండ్‌

సాక్షి, బిజినెస్‌డెస్క్‌: కరెన్సీ కదలికలు, క్రిస్మస్‌..న్యూ ఇయర్‌ సీజన్‌ వ్యయాలు విహారయాత్రల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. చాలా మంది పర్యాటకులు సుదీర్ఘ యాత్రల కన్నా అయిదు రోజుల్లో చుట్టేసొచ్చేలా టూర్లను ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందులోనూ వీసా సులభంగా దొరికే దేశాలను ఎంచుకుంటున్నారు. ట్రావెల్‌ సర్విసుల కంపెనీ కాక్స్‌ అండ్‌ కింగ్స్‌కి నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత శీతాకాలంతో పోలిస్తే ఈసారి అంతర్జాతీయ ప్రయాణాలకి కేవలం 15–20 రోజులు ముందుగా బుక్‌ చేసుకునే ధోరణి 30 శాతం పెరిగింది.

65 శాతం బుకింగ్స్‌ అయిదు రోజుల్లోపు ట్రిప్‌లకే పరిమితమైంది. ఈసారి భారతీయ ప్రయాణికులు బయల్దేరడానికి కాస్త ముందుగా మాత్రమే బుక్‌ చేసుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో ఖర్చులు అంచనాలకు అనుగుణంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని, సుదీర్ఘ ప్రయాణాలను...డాలర్‌ మారకంతో ముడిపడి ఉండే ప్రయాణ ఖర్చులను తగ్గించుకుంటున్నారని నివేదిక పేర్కొంది. అలాగని ప్రయాణాలకు డిమాండేమీ తగ్గిపోలేదని తెలిపింది. ఈసారి క్రిస్మస్, న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా పర్యాటకులు తమ సౌకర్యానికి, ఖర్చు చేసే ప్రతి రూపాయికి లభించే ప్రయోజనాలకి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారని వివరించింది.  

రిపోర్టులో మరిన్ని విశేషాలు.. 
మిగతా పేరొందిన ప్రాంతాలతో పోలిస్తే దుబాయ్, వియత్నాంల వైపు పర్యాటకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కనెక్టివిటీ బాగుండటం, వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం, తక్కువ రోజుల్లోనే ఎక్కువగా చుట్టేసేయడానికి అవకాశంలాంటి అంశాలు వీటికి సానుకూలంగా ఉంటున్నాయి. అందుకే ఆఖరు నిమిషంలో ప్లాన్‌ చేసుకునే వారు దుబాయ్, వియత్నాంల వైపు చూస్తున్నారు. శ్రీలంక, బాలి, ఒమన్‌ వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.  

 ఆఖరు నిమిషంలో బుక్‌ చేసుకుంటున్న వారిలో 45 శాతం మంది పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణిస్తున్న కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. వారు భద్రత, వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండే దుబాయ్‌లాంటి డెస్టినేషన్లను ఎంచుకుంటున్నారు. ఇక తొలిసారిగా విదేశీ పర్యటన చేస్తున్న వారికి, మిలీనియల్స్‌కి, జెనరేషన్‌ జెడ్‌కి, యువ జంటలకి, బ్యాక్‌ప్యాకర్స్, యువ ప్రొఫెషనల్స్, మిత్ర బృందాలకి వియత్నాం ఫేవరెట్‌గా ఉంటోంది. సాధారణంగా ఇది పీక్‌ సీజన్‌ కావడంతో పాటు కొన్ని ప్రదేశాలకు టికెట్ల కొరత ఉన్నప్పటికీ ఈ–వీసా ప్రక్రియపై స్పష్టత, ఎయిర్‌ కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంలాంటి అంశాలు ఆ దేశానికి సానుకూలంగా ఉంటున్నాయి.  

శీతాకాలంలో స్వల్ప వ్యవధి టూర్లకు బుక్‌ చేసుకునే వారిలో 55 ఏళ్ల పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు, ప్రయాణం సులభతరంగా ఉండే ప్రాంతాలను వారు ఎంచుకుంటున్నారు. 
ఆఖరు నిమిషపు శీతాకాలం బుకింగ్స్‌లో అత్యధిక వాటా దుబాయ్‌ది ఉంటోంది. ముఖ్యంగా పిల్లలు, వయోవృద్ధులున్న కుటుంబాలు దీన్ని ఎంచుకుంటున్నాయి.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement