హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజాన్ సోలార్ బ్రాండ్ కింద సౌర విద్యుత్ ఉత్పత్తులను అందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇన్వెస్ట్ చేశారు. బ్రాండ్ విశ్వసనీయత మరింత పెరిగేందుకు, జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు చారుగుండ్ల భవానీ సురేశ్ తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటున్నామని, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్ తదితర మార్కెట్లో దూకుడుగా విస్తరిస్తున్నామని ఆయన వివరించారు. 2008లో ఏర్పాటైన సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ తదితర విభాగాల్లో అవసరాలకు కావాల్సిన సోలార్ ఉత్పత్తులను అందిస్తోంది.


