దేశంలో అత్యధిక ట్యాక్స్‌లు వీటి మీదే.. | Indians paying highest tax on these things full list here | Sakshi
Sakshi News home page

దేశంలో అత్యధిక ట్యాక్స్‌లు వీటి మీదే..

Jan 27 2025 5:28 PM | Updated on Jan 31 2025 1:34 PM

Indians paying highest tax on these things full list here

దేశంలో పన్నుల (Tax) అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ముఖ్యంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నప్పుడు అందరూ పన్నుల గురించే మాట్లాడుతుంటారు. పన్నుల్లో ఉపశమనం కల్పించడం ద్వారా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రజలు ఆశిస్తుంటారు. ప్రస్తుతం దేశంలో వస్తువులు, సేవలపై వస్తు సేవల పన్ను (GST) పేరుతో పన్నులు వసూలు చేస్తోంది ప్రభుత్వం.

జీఎస్టీ 
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అనేది దేశంలో వస్తువులు, సేవల సరఫరాపై విధించే పన్ను. గతంలో వివిధ రకాల వస్తువులు, సేవలపై వ్యాట్‌ రూపంలో పన్నులు వసూలు చేసేవారు. కొన్ని రాష్ట్ర పన్నులు మినహా దాదాపు అన్ని పరోక్ష పన్నులను ఉపసంహరించి సమగ్ర పన్నుగా జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2017  జూలై 1 నుండి ఇది అమలులోకి వచ్చింది.

వివిధ వస్తువులు, సేవలపై పన్ను వసూలు కోసం జీఎస్టీలో 5 వేర్వేరు పన్ను స్లాబ్‌లుగా విభజించారు. అవి 0%, 5%, 12%, 18%, 28%. అయితే పెట్రోలియం ఉత్పత్తులు , మద్య పానీయాలు, విద్యుత్తుపై జీఎస్టీ కింద పన్ను విధించరు. వీటిపై మునుపటి పన్ను విధానం ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్నులు విధిస్తాయి. అయితే మనం ఏయే వస్తువులపై అధికంగా ట్యాక్స్‌ (Highest Tax) చెల్లిస్తున్నామో ఇప్పుడు చూద్దాం.

28% శ్లాబ్‌లోని వస్తువులు
జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు 226 ఉత్పత్తులను 28 శాతం పన్ను శ్లాబ్‌లో చేర్చారు. అయితే. కాలక్రమేణా ఈ జాబితా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కేవలం 35 ఉత్పత్తులు మాత్రమే ఈ స్లాబ్ కిందకు వస్తాయి. వీటిలో ప్రధానంగా విలాసవంతమైనవి లేదా అత్యవసరం కానివి ఉంటాయి. అవి.. సిమెంట్, ఆటోమొబైల్ విడిభాగాలు, టైర్లు, మోటారు వాహనాల పరికరాలు, పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా, విమానాలు, యాక్స్ వంటి ప్రత్యేక వస్తువులు, సినిమా టిక్కెట్లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆహారం, పానీయాలు.

గతంలో ఎక్కువ ఉండి తగ్గినవి
కొన్ని సంవత్సరాల క్రితం 28% పన్ను శ్లాబ్‌లో చేర్చబడిన 15 వస్తువులను 18% పన్ను శ్లాబ్‌కు తగ్గించారు. వీటిలో వాషింగ్ మెషీన్, 27 అంగుళాల టీవీ, వాక్యూమ్ క్లీనర్, ఫ్రిజ్, పెయింట్ వంటి వస్తువులు ఉన్నాయి. దీంతో సామాన్యులకు కొంత ఊరట లభించింది.

పెట్రోల్, డీజిల్
ప్రస్తుతం పెట్రోలు, డీజిల్‌లు జీఎస్టీ పరిధిలోకి రావు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై వ్యాట్‌, ఇతర పన్నులను తమ సొంతం ప్రకారం విధిస్తున్నాయి. వాటిని జీఎస్టీలో చేర్చి 28% శ్లాబ్‌లో ఉంచితే తద్వారా పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా త‍గ్గే ఆస్కారం ఉంటుంది. ఈ పన్ను భారం ముఖ్యంగా సామాన్య ప్రజలను, పరిశ్రమలను ప్రభావితం చేస్తుంది. వచ్చే బడ్జెట్‌లో ఈ రేట్లను మార్చడం ద్వారా ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో జీఎస్టీ సంగతేమో కానీ ఆదాయపు పన్ను పరిమితికి సంబంధించి మాత్రం పెద్ద ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement