
దేశంలో సంపద పెరుగుతోంది. సంపన్నులు రెట్టింపవుతన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తాజా నివేదిక ప్రకారం.. 2024-2029 మధ్య అంటే ఐదేళ్లలో మిలియనీర్ల జనాభా 55 శాతానికిపైగా పెరుగుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు 21 శాతం కంటే రెట్టింపు.
2023-2024 మధ్య కాలంలో భారత ఆర్థిక సంపద 10.8 శాతం పెరిగిందని, ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) సగటు 7.3 శాతం దాటిందని బీసీజీ తెలిపింది. ఉత్తర అమెరికా (4%), పశ్చిమ ఐరోపా (5%) లను మించి ఎఆసియా-పసిఫిక్ ప్రాంతం 2029 నాటికి వార్షికంగా 9% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
2024 నుంచి 2029 వరకు డాలర్ మిలియనీర్ల సంఖ్య 55 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామని బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్, పార్టనర్ మయాంక్ ఝా తెలిపారు. తొలి తరం మొదటిసారి సంపద సృష్టికర్తలు, ముఖ్యంగా మిలీనియల్ (యువ) పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు పరిశ్రమను పునర్నిస్తున్నారని పేర్కొన్నారు.
బలమైన ఈక్విటీ మార్కెట్ పనితీరు కారణంగా ఆర్థిక ఆస్తులు 8.1% పెరగడంతో 2024లో ఆర్థిక సంపద రికార్డు స్థాయిలో 305 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని బీసీజీ గ్లోబల్ నివేదిక తెలిపింది. విలువైన క్లయింట్ల గుర్తింపు, ప్రాధాన్యంలో సంస్థలకు సహకారం అందిస్తూ ఉత్పాదక ఏఐ (GenAI) సంపద ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని వివరించింది. ఈ ఉత్పాదక ఏఐని త్వరగా అందిపుచ్చుకున్నవారు ఐదు రెట్లు అధికంగా పురోగమిస్తున్నారని వివరించింది.