
మార్చి క్వార్టర్లో 18 శాతం అప్
రూ. 12,630 కోట్లు
రూ. 11 డివిడెండ్
ముంబై: ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 12,630 కోట్ల నికర లాభం (స్టాండెలోన్ ప్రాతిపదికన) నమోదు చేసింది. క్రితం క్యూ4లో నమోదైన రూ. 10,708 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 18 శాతం అధికం. తాజా క్యూ4లో లాభం రూ. 12,050 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. సీక్వెన్షియల్గా డిసెబర్ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 7 శాతం పెరిగింది. రూ. 2 ముఖ విలువ ఉండే ఒక్కో షేరుపై రూ. 11 చొప్పున బ్యాంకు డివిడెండ్ ప్రకటించింది.
తగ్గిన మొండిబాకీలు..
సమీక్షాకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి 2.16 శాతం నుంచి 1.67 శాతానికి దిగి వచ్చింది. అలాగే నికర ఎన్పీఏల నిష్పత్తి 0.42 శాతం నుంచి 0.39 శాతానికి తగ్గింది. పరిమాణంపరంగా చూస్తే రూ. 27,962 కోట్ల నుంచి రూ. 24,166 కోట్లకు స్థూల ఎన్పీఏలు దిగి వచ్చాయి. సీక్వెన్షియల్గా చూస్తే డిసెంబర్ క్వార్టర్లో స్థూల ఎన్పీఏల నిష్పత్తి 1.96 శాతంగా, నికర ఎన్పీఏల నిష్పత్తి 0.42 శాతంగా ఉంది. మొండి బాకీలకు ప్రొవిజనింగ్ (పన్నులకు ప్రొవిజన్ మినహాయించి) రూ. 718 కోట్ల నుంచి రూ. 891 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ లాభం సుమారు 16 శాతం పెరిగి రూ. 13,502 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 400 శాఖలు ప్రారంభించనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
డిపాజిట్లు 14 శాతం అప్..
→ ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్లు వార్షికంగా క్రితం క్యూ4తో పోలిస్తే తాజా క్యూ4లో 14 శాతం, క్వార్టర్లవారీగా చూస్తే సుమారు 6 శాతం పెరిగాయి. మార్చి 31 నాటికి మొత్తం డిపాజిట్లు రూ. 16.11 లక్షల కోట్లుగా ఉన్నాయి.
→ దేశీయంగా నికర రుణాలు వార్షికంగా 13.9 శాతం, సీక్వెన్షియల్గా 2.2 శాతం పెరిగాయి. రిటైల్ రుణాల పోర్ట్ఫోలియో వార్షికంగా 8.9 శాతం, సీక్వెన్షియల్గా 2 శాతం పెరిగింది. మొత్తం రుణాల పోర్ట్ఫోలియోలో రిటైల్ రుణాల వాటా 52.4 శాతంగా ఉంది. చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాల పోర్ట్ఫోలియో 33.7 శాతం, రూరల్ రుణాల పోర్ట్ఫోలియో 5.1 శాతం, కార్పొరేట్ రుణాల పోర్ట్ఫోలియో 11.9% పెరిగింది. వార్షికంగా మొత్తం రుణాలు 13.3 శాతం, సీక్వెన్షియల్గా 2.1 శాతం పెరిగి రూ. 13.42 లక్షల కోట్లకు చేరాయి.
→ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 11 శాతం పెరిగి రూ. 19,093 కోట్ల నుంచి రూ. 21,193 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 4.40 శాతం నుంచి 4.41 శాతానికి చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎన్ఐఎం 4.32 శాతంగా ఉంది.
→ క్యూ4లో బ్యాంకు కొత్తగా 241 శాఖలు ప్రారంభించింది. దీంతో మొత్తం శాఖల నెట్వర్క్ 6,983కి చేరింది. 2025 మార్చి 31 నాటికి మొత్తం ఏటీఎంలు, క్యాష్ రీసైక్లింగ్ మెషిన్ల సంఖ్య 16,285గా ఉంది.