హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎండీ గర్గ్
దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ తదుపరి దశ వృద్ధి ప్రస్థానంలో ముందుకెళ్లాలంటే స్థానికంగా తయారీ, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ, అంతర్జాతీయ విస్తరణపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ చెప్పారు. ‘భారత్లో గెలవాలంటే, తప్పనిసరిగా భారత్లో ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తమ పుణె తయారీ ప్లాంటుకు అవసరమైన విడిభాగాల సరఫరా వ్యవస్థపై రూ. 4,500 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేశామన్నారు.
ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు చెప్పారు. కీలక లోహాలు, విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ కోసం ఏ ఒక్క దేశంపైనో ఆధారపడితే సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉండబోదని గర్గ్ పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్, సెన్సార్లు మొదలైన వాటిని సమగ్రపర్చుకోకపోతే పెను సవాళ్లు తప్పవని, మనల్ని దాటి పరిశ్రమ ముందుకెళ్లిపోతుందని ఆయన హెచ్చరించారు. భారతీయ ఇంజినీర్లు, డిజైనర్ల పరిజ్ఞానం ప్రశంసనీయమన్నారు. అయితే, పరిజ్ఞానానికి, సంసిద్ధతకి మధ్య గణనీయంగా అంతరం ఉంటోందని, దీన్ని సత్వరం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని గర్గ్ వివరించారు.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట


