
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2025 సంవత్సరానికి గాను వరల్డ్ ఎకనమిక్ ఫోరం 100 టెక్నాలజీ పయొనీర్ల జాబితాలో హైదరాబాద్కి చెందిన డేటా షేరింగ్ ప్లాట్ఫాం ఈక్వల్ చోటు దక్కించుకుంది. భారత్ నుంచి మొత్తం 10 సంస్థలు ఈ లిస్టులో ఎంపికయ్యాయి.
గతంలో డబ్ల్యూఈఎఫ్ పయొనీర్లుగా నిల్చిన గూగుల్, స్పాటిఫై, ఎయిర్బీఎన్బీ వంటి దిగ్గజాల సరసన తమ సంస్థ కూడా నిల్చిందని కంపెనీ వ్యవస్థాపకుడు, వెంచర్ క్యాపిటలిస్ట్ జీవీకే కేశవ్ రెడ్డి తెలిపారు. కేవైసీ తదితర అంశాలకు సంబంధించి డేటా షేరింగ్కి ఉపయోగపడే మౌలిక సదుపాయాలను ఈక్వల్ అందిస్తోంది. కేశవ్ రెడ్డి, రాజీవ్ రంజన్ కలిసి 2022లో దీన్ని నెలకొల్పారు. 2024లో 75,000 లావాదేవీలను ప్రాసెస్ చేసింది.
బృహస్పతి టెక్నాలజీస్లో పెట్టుబడులు
నిఘా, సెక్యూరిటీ సొల్యూషన్స్ సేవలందించే హైదరాబాద్ సంస్థ బృహస్పతి టెక్నాలజీస్ (Brihaspathi Technologies Limited) తాజాగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 10 మిలియన్ డాలర్లు సమీకరించింది. హైదరాబాద్లో 72,000 చ.అ. విస్తీర్ణంలో సీసీటీవీ తయారీ ప్లాంటు ఏర్పాటుకు, కార్యకలాపాల విస్తరణకు ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు సంస్థ ఎండీ రాజశేఖర్ పాపోలు తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈ ప్లాంటు అందుబాటులోకి వస్తుందని విలేఖరుల సమావేశంలో చెప్పారు. వృద్ధి ప్రణాళికల్లో భాగంగా కొత్తగా 400 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు వివరించారు. మరోవైపు, 2026–27లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ఆలోచన కూడా ఉన్నట్లు వివరించారు.
ఈ నిధులను పరిశోధన–అభివృద్ధి సామర్థ్యాలను, తయారీ సామర్థ్యాలను పెంచుకునేందుకు, ఏఐ ఆధారిత సొల్యూషన్స్ను రూపొందించేందుకు ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు. ఇటీవలే మహారాష్ట్ర రోడ్ రవాణా కార్పొరేషన్ నుంచి సుమారు రూ. 100 కోట్ల విలువ చేసే సీసీటీవీ మానిటరింగ్ సిస్టం ఏర్పాటునకు ఆర్డరు లభించినట్లు రాజశేఖర్ తెలిపారు.