
ఆన్లైన్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ క్రెడ్ వ్యవస్థాపకులు, సీఈఓ కునాల్ షా ఇటీవల ‘డబ్బు-సమయం’పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఫోర్బ్స్ తో మాట్లాడుతూ చాలా మంది భారతీయులకు డబ్బుకు సంబంధించి సమయం విలువ తెలియదని షా అన్నారు.
‘మిలియన్ డాలర్లు సంపాదించే అమెరికన్లు తమ గంట వేతన విలువను సరిగ్గా అర్థం చేసుకుంటారు. అదే భారతదేశంలో ఎవరినైనా గంటకు తమ జీతం ఎంత అని అడిగితే.. వారికి ఎలాంటి క్లూ ఉండదు’ అని షా అన్నారు. ఈ ధోరణి దీర్ఘకాలంలో భారీ మొత్తం నష్టపోయేందుకు దారితీస్తుందని చెప్పారు. భారత్లో చాలామంది సమయాన్ని ఎక్కువగా వృథా చేస్తున్నట్లు తెలిపారు. ‘గంటకు రూ.10వేలు సంపాదించే వారు విమాన టికెట్పై రూ.500 ఆదా చేసుకోవడానికి మరో గంట సమయం వెచ్చిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2 లక్షల బుకింగ్స్
మహిళా భాగస్వామ్యం అంతంతే..
‘భారత్లో కాకుండా నేను వెళ్లిన ప్రతి మీటింగ్లోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండేవారు. ముఖ్యంగా ప్రొడక్ట్ టెక్ కంపెనీల్లో ఆర్థిక పరమైన అంశాలపై ఇతర ప్రాంతాల్లో మహిళలదే పైచేయి. కానీ భారత్లో వీరి సంఖ్య చాలా పరిమితంగా ఉంది. ఈ స్పష్టమైన వ్యత్యాసం దేశ ఆర్థిక భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. శ్రామిక శక్తిలోనూ మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. పురుషులే పనిచేస్తే భారత్ తలసరి ఆదాయం పెరగదు. మహిళలకు ప్రాతినిథ్యం పెరగాలి’ అని చెప్పారు.