న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు సోమవారం కోలుకున్నాయి. గత వారం వరుసగా నాలుగు రోజుల పాటు ఇవి నష్టాలను చవిచూడడం గమనార్హం. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రా. పసిడి ధర రూ.1,700 పెరిగి రూ.1,52,300 స్థాయికి చేరింది. వెండి ధర కిలోకి రూ.4,800 జంప్ చేసి రూ.2,45,500 వద్ద ముగిసింది.
గత శుక్రవారం వెండి కిలోకి ఏకంగా రూ.8,040 నష్టపోవడం తెలిసిందే. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లోనూ బంగారం, వెండి లాభాలతో ట్రేడయ్యాయి. ఔన్స్ బంగారం ధర 50 డాలర్లు (1.2 శాతం) పెరిగి 4,210 డాలర్ల వద్ద ట్రేడ్ కాగా, వెండి 2 శాతానికి పైగా లాభపడి 66.47 డాలర్ల వద్ద కొనసాగింది.
రూపాయి బలహీనపడడానికి తోడు గత వారం నష్టాలతో కొనుగోళ్లకు మద్దతు లభించినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల దీర్ఘకాలం పాటు గరిష్టాల్లో ఉంటాయన్న అంచనాలకు వ్యతిరేకంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మెరుగుపడడం పసిడికి మద్దతిచ్చినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.


