బంగారం ఆభరణాల వినియోగం నెమ్మదించొచ్చు  | Gold jewellery consumption to dip by 9-10percent in FY26 | Sakshi
Sakshi News home page

బంగారం ఆభరణాల వినియోగం నెమ్మదించొచ్చు 

May 31 2025 6:28 AM | Updated on May 31 2025 6:28 AM

Gold jewellery consumption to dip by 9-10percent in FY26

2025–26లో 9–10 శాతం తక్కువ 

ధరలు పెరగడం ప్రభావం చూపించొచ్చు 

పెట్టుబడుల డిమాండ్‌ కొనసాగుతుంది 

రేటింగ్స్‌ సంస్థ ఇక్రా అంచనా

ముంబై: బంగారం ధరల పెరుగుదలతో ఆభరణాల వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 9–10 శాతం మేర తగ్గిపోవచ్చని రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ముఖ్యంగా బంగారం ధరలు 33 శాతం పెరగడం వినియోగం తగ్గుముఖం పట్టడానికి కారణంగా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలోనూ (2024–25) ఆభరణాల వినియోగం 7 శాతం తగ్గడం గమనార్హం. 2023–24లో బంగారం బిస్కెట్లు, కాయిన్ల డిమాండ్‌ 17 శాతం, 2024–25లో 25 శాతం చొప్పున పెరిగినట్టు ఇక్రా నివేదిక వెల్లడించింది. 

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతులు, భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతల మధ్య సురక్షిత సాధనమైన బంగారానికి పెట్టుబడుల డిమాండ్‌ పెరగడమే వృద్ధిని ఇతోధికం చేసినట్టు వివరించింది. పెట్టుబడుల పరంగా పసిడికి డిమాండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) కొనసాగుతుందని అంచనా వేసింది. బంగారం బిస్కెట్ల డిమాండ్‌ 10 శాతం, కాయిన్ల డిమాండ్‌ 35 శాతం వరకు పెరగచొచ్చని తెలిపింది. ఇక 2025–26లో బంగారం ఆభరణాల వినియోగం విలువ పరంగా 12–14 శాతం వృద్ధిని చూడొచ్చని పేర్కొంది. ధరల పెరుగుదల ఫలితమే ఇదని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలోనూ ధరలు 33 శాతం పెరగడంతో విలువ పరంగా 28 శాతం వృద్ధి నమోదైనట్టు గుర్తు చేసింది.  

సంఘటిత జ్యుయలర్లకు సానుకూలం.. 
‘‘సంఘటిత రంగంలోని పెద్ద స్థాయి రిటైల్‌ జ్యుయలర్ల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో 14–16 శాతం మేర పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ధరల పెరుగుదలకుతోడు, ప్రణాళికబద్ధమైన స్టోర్ల విస్తరణ, అసంఘటిత రంగంలోని వర్తకుల నుంచి మార్కెట్‌ వాటాను క్రమంగా సొంతం చేసుకుటుండడం, ఈ ఏడాది పర్వదినాలు ఎక్కువగా ఉండడం డిమాండ్‌కు మద్దతునిస్తాయి’’అని ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, గ్రూప్‌ హెడ్‌ జితిన్‌ మక్కర్‌ తెలిపారు. దూకుడుగా స్టోర్లను విస్తరించే కొన్ని సంఘటిత జ్యుయలరీ సంస్థలకు మినహా ఎక్కువ జ్యుయలర్లకు అమ్మకాల పరిమాణం తగ్గొచ్చని ఇక్రా అంచనా వేసింది.  

ధరలు ఈ స్థాయిలో స్థిరపడొచ్చు 
బంగారం ధరలు ప్రస్తుత స్థాయిలో స్థిరపడొచ్చని ఇక్రా తెలిపింది. అంతర్జాతీయంగా ఊహించని ఏవైనా పెద్ద ఘటనలు జరిగితే తప్పించి ఇదే స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. సంఘటిత రంగంలోని జ్యుయలరీ సంస్థల నిర్వహణ మార్జిన్లు 30 బేసిస్‌ పాయింట్లు పెరిగి 7.2 శాతంగా ఉంటాయని తెలిపింది. రుణ వ్యయాల పెరుగుదలతో నికర మార్జిన్ల విస్తరణ 10 బేసిస్‌ పాయింట్లు మించకపోవచ్చని పేర్కొంది. తమ మూలధన అవసరాలకు జ్యుయలర్లు బంగారం తనఖా రుణాలను వినియోగిస్తుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement