న్యూఢిల్లీ: పసిడి, వెండి ధరలు బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమయ్యాయి. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3 శాతం నష్టంతో 3,980 డాలర్ల స్థాయికి పడిపోయింది. వెండి ధర అయితే ఔన్స్కు 8 శాతం నష్టపోయి 57 డాలర్లకు దిగొచ్చింది. దీంతో వీటి ధరలు ఈ ఏడాది కనిష్టాలకు చేరినట్టయింది.
జనవరి 29న పసిడి ఆల్టైమ్ గరిష్టం 5,626 డాలర్లు, వెండి 121.78 డాలర్లను నమోదు చేయడం తెలిసిందే. అక్కడి నుంచి చూస్తే బంగారం 29 శాతం, వెండి 50 శాతానికి పైనే నష్టపోయినట్టు లెక్క. అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందంతో పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడడానికి తోడు యూఎస్ ఫెడ్ సమీప కాలంలోనే వడ్డీ రేట్ల పెంపును చేపడుతుందన్న అంచనాలతో పసిడి, వెండి ధరలు దిగొస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
ఢిల్లీలో రూ.1,200 డౌన్
ఢిల్లీ మార్కెట్లో 10 గ్రా. బంగారం ధర రూ.1,200 నష్టాన్ని చవిచూసింది. రూ.1,48,100 వద్ద ముగిసింది. వెండి కిలోకి రూ.4,000 తగ్గి రూ.2,31,000కు పరిమితమైంది. అంతక్రితం రోజు వెండి రూ.10,500 నష్టపోవడం తెలిసిందే. యూఎస్ డాలర్ పవర్ఫుల్ ర్యాలీకి తోడుగా కఠిన ద్రవ్య విధానంపై ఏర్పడిన అంచనాలతో బంగారం, వెండి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు.


