స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ ‘ఫైర్ బోల్ట్’ స్మార్ట్ఫోన్ విభాగంలోకి అడుగుపెడుతోంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘బోల్ట్’ అనే సరికొత్త స్మార్ట్ఫోన్ బ్రాండ్ను ఆగస్టు మధ్య నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ అర్ణవ్ కిషోర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమికంగా 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 472 కోట్లు) పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిధులను ఉత్పత్తి అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్, పంపిణీ, నెట్వర్క్ విస్తరణకు కేటాయించామన్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఈ పెట్టుబడులను మరింత పెంచుతామని కిషోర్ తెలిపారు.
రూ. 10,000 – రూ. 15,000 ధరల్లో ఫోన్లు
ఈ బ్రాండ్ కింద రూ.10,000 నుంచి రూ.15,000 ధరల శ్రేణిలో 4జీ, 5జీ స్మార్ట్ఫోన్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. రాబోయే పండగ సీజన్ కంటే ముందే దేశవ్యాప్తంగా ఈ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్లోకి వచి్చన తొలి 4–5 నెలల్లోనే 5 లక్షల నుండి 10 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్ణవ్ కిషోర్ వివరించారు.
ఒప్పో ఇండియా నుంచి రెనో16 సిరీస్
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా రెనో16 సిరీస్ని ఆవిష్కరించింది. ఇందులో రెనో16, రెనో16సీ ఉంటాయి. దేశీయంగా తొలి హోలోవర్స్ 3డీ డిజైన్, 50 ఎంపీ టెలిఫోటో లెన్స్తో ఏఐ పోర్ర్టెయిట్ కెమెరా, హెచ్డీఆర్ వీడియో రికార్డింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. వేరియంట్ని బట్టి స్నాప్డ్రాగన్ 7 జెన్4, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 6700 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. రెనో16 ధర రూ. 61,999 నుంచి, రెనో16సీ రేటు రూ. 46,999 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 9 నుంచి ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒప్పో ఈ–స్టోర్స్లో లభిస్తాయి. బ్యాంకును బట్టి 10 శాతం వరకు క్యాష్బ్యాక్, జీరో డౌన్పేమెంట్, రూ. 5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లాంటివి ఆఫర్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!


