మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు! | Why Indians Step Back To Sale Old Smart Phones Reason Is This | Sakshi
Sakshi News home page

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

Jun 20 2026 1:24 PM | Updated on Jun 20 2026 2:00 PM

Why Indians Step Back To Sale Old Smart Phones Reason Is This

విష్ణు ఇంట్లో ఒక పాత స్మార్ట్‌ఫోన్‌ చాలారోజులుగా అలాగే పడిఉంది. ఇప్పుడు అతని భార్య మహేశ్వరి ఆ ఫోన్‌ను అమ్మాలని చూస్తోంది. కానీ విష్ణు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. మహేశ్వరి మాత్రం “ఇంట్లో పడేసి ఉంచడం ఎందుకు? అమ్మేయొచ్చు కదా” అని పదే పదే అంటోంది. కానీ విష్ణు మాత్రం ప్రతి సారి ఏదో ఒక కారణం చెప్పి విషయం తప్పించుకుంటున్నాడు. అసలు విషయం ఏమిటంటే.. తన భార్యకు కూడా తెలియని సున్నితమైన వ్యక్తిగత డేటా అందులో ఉందన్న ఆందోళన అతడిని వెంటాడుతోంది.

ఇది ఒక్క విష్ణు కథ మాత్రమే కాదు.. ఇలాంటి ఆందోళనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మందిలో కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇండియన్ల మనసులో ఇదే సందేహం. పాత ఫోన్ అమ్మితే డబ్బు వస్తుంది. కానీ ఆ ఫోన్‌లో ఉన్న డేటా ఏమవుతుంది? అనే భయం మాత్రం ఎక్కువవుతోంది. కొత్త సర్వే ఒకటి చెబుతున్నదాని ప్రకారం దాదాపు 70 శాతం మంది భారతీయులు తమ పాత స్మార్ట్‌ఫోన్లను అమ్మడానికి వెనుకడుగు వేస్తున్నారు. కారణం ఒక్కటే.. డేటా ప్రైవసీపై భయం.

రీసేల్‌ ఫ్లాట్‌ఫారమ్‌ క్యాషీఫై దేశంలో వేల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రజలు ఇప్పుడు ఫోన్ అమ్మకంలో ధర కంటే భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు 45 శాతం మంది “ఎక్కడ అమ్ముతున్నాం, డేటా సేఫ్‌గా డిలీట్ అవుతుందా లేదా?” అన్నదే ప్రధానంగా చూస్తున్నారు. ధరను ముఖ్యంగా చూసే వారు 29.5 శాతం మాత్రమే ఉండటం ఈ మార్పును స్పష్టంగా చూపిస్తోంది.

ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. వందలో 83 మంది ఫోన్ అమ్మే ముందు ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారు. కానీ అదే గ్రూపులో 41 శాతం మంది ఫ్యాక్టరీ రీసెట్‌తో డేటా పూర్తిగా పోదని తమకు తెలుసని అంటున్నారు. అంతేకాదు.. ప్రతి ముగ్గురిలో ఒకరు పాత ఫోన్‌ల నుంచి డిలీట్ చేసిన డేటాను తిరిగి రికవర్ చేయగలిగామని చెప్పారు. అంటే ప్రజలు వాళ్లు చేస్తున్న పని కూడా పూర్తి నమ్మకం లేకుండా ఉన్నారన్నమాట.

అయితే భారతీయుల ఈ భయమే మార్కెట్‌ను పూర్తిగా మార్చేస్తోంది. దాదాపు 69 శాతం మంది “సర్టిఫైడ్ డేటా డిలీషన్” ఉంటేనే ఫోన్ అమ్ముతామని చెబుతున్నారు. 83 శాతం మంది అయితే డేటా పూర్తిగా తొలగించబడిందని చెప్పే సర్టిఫికెట్ తప్పనిసరిగా కావాలని అంటున్నారు. అంతేకాదు, సురక్షిత డేటా డిలీషన్ కోసం చిన్న ఫీజు చెల్లించడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అంత తీవ్రంగా సమస్య పెరిగిపోయింది.

ఈ “సర్టిఫైడ్ డేటా డిలీషన్” అన్నది సాధారణంగా పాత ఫోన్లు కొనుగోలు చేసే రిసేల్ ప్లాట్‌ఫామ్స్, రిఫర్బిష్ కంపెనీలు లేదంటే ఈ-వేస్ట్ రీసైక్లింగ్ సంస్థలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ టూల్స్‌తో డేటాను పూర్తిగా తుడిచేసి(ERASE).. తిరిగి రికవర్ చేయలేని స్థాయిలో డిలీట్ చేస్తాయి. ఆ ప్రక్రియ పూర్తైన తర్వాతే ఒక “డేటా డిలీషన్ సర్టిఫికెట్” ఇస్తారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే.. ఇదో పెద్ద తతంగం అని వినియోగదారుడు భావించడం. అలాగే అన్ని రిసేల్ ప్లాట్‌ఫామ్స్ ఈ స్థాయి హామీ ఇవ్వడం లేదు. అందుకే చాలామంది ఫోన్లు అమ్మకుండా ఇంట్లోనే దాచుకుంటున్నారు.

ఇంకా పెద్ద విషయం ఏమిటంటే, 87 శాతం మంది భారతీయులు పాత ఫోన్లు తిరిగి అమ్మకానికి వచ్చే ముందు డేటా డిలీషన్‌పై కఠినమైన చట్టాలు ఉండాలని కోరుతున్నారు. అంటే ఇది కేవలం వ్యక్తిగత భయం కాదు.. వ్యవస్థపరమైన సమస్యగా మారిపోయింది.

సో.. విష్ణు తన పాత ఫోన్‌ను ఎందుకు దాచిపెట్టాడో అర్థమయ్యిందా?. ఆ ఫోన్‌ను బయటకు తీస్తే డబ్బు వస్తుంది. కానీ ఆ ఫోన్‌లో ఉన్న డేటా ఎవరి చేతికి వెళ్తుందో? అనే ప్రశ్న మాత్రం అతన్ని ఆపేస్తోంది. విష్ణు మాత్రమే కాదు.. ఓ అనిత, ఓ రాకేశ్‌.. ఇలా ఎందరో ఆగిపోవడానికి అసలు కారణం కూడా అదే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement