అమెరికాకు చెందిన ప్రముఖ ఫిన్టెక్ సంస్థ బోల్ట్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. తన మొత్తం హ్యూమన్ రిసోర్సెస్ (HR) విభాగాన్ని తొలగించింది. అంతేకాకుండా, మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 30 శాతం మందిని కూడా ఉద్యోగాల నుంచి తీసివేసింది. ఈ నిర్ణయాన్ని కంపెనీ సీఈఓ రయాన్ బ్రెస్లో సమర్ధించడం మరింత సంచలనం సృష్టించింది.
హెచ్ఆర్ విభాగం కంపెనీలో అసలు లేని సమస్యలను సృష్టిస్తోందని.. ఆ టీమ్ను తొలగించిన తర్వాత సమస్యలు కూడా మాయమయ్యాయని రయాన్ బ్రెస్లో పేర్కొన్నారు. కంపెనీని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి, పనితీరు మెరుగుపరచడానికి ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
బోల్ట్ సంస్థను రయాన్ బ్రెస్లో 2014లో ప్రారంభించారు. ఇది చాలా తక్కువ కాలంలోనే అమెరికాలో అత్యంత వేగంగా ఎదిగిన ఫిన్టెక్ స్టార్టప్లలో ఒకటిగా మారింది. కానీ.. 2022లో ఆయన సీఈఓ పదవి నుంచి తప్పుకున్న తర్వాత సంస్థ విలువ తగ్గడం ప్రారంభమైంది. ఆ తరువాత అనేకసార్లు ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. 2025లో తిరిగి కంపెనీ బాధ్యతలను బ్రెస్లో చేపట్టారు. తరువాత కీలక మార్పులు చేసారు.
ప్రస్తుతం బోల్ట్ సంస్థలో కేవలం 100 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య గతంతో పోలిస్తే చాలా తక్కువ. అయినప్పటికీ, కంపెనీ పనితీరు మెరుగైందని బ్రెస్లో చెబుతున్నారు. కస్టమర్లకు వేగంగా సేవలు అందుతున్నాయని, ఉద్యోగుల పనితీరు కూడా మెరుగుపడిందని తెలిపారు.
ఇదీ చదవండి: కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు!


