
ఆర్థిక ఆస్తుల పంపకం సులభమే
స్థిరాస్తులవిషయంలో సంక్లిష్టతలు
అందుబాటులో ఎన్నో మార్గాలు
వీలునామా, గిఫ్ట్ డీడ్, ఫ్యామిలీ ట్రస్ట్
తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వివాదాలకు తావు
సుధాకర్ (71) తన మరణానంతరం తనకున్న ఏకైక ఇల్లు ఇద్దరు కుమారులకు సమానంగా చెందుతుందని వీలునామా రాశాడు. అనారోగ్యంతో సుధాకర్ 2022లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. మూడేళ్లు గడుస్తున్నా కానీ సుధాకర్ కోరిక నెరవేరలేదు. ఆ ఇంటి కోసం సోదరులిద్దరి మధ్య అంగీకారం కుదరడం లేదు. ఇంటిని విక్రయించి వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకుందామని ఒకరు అంటుంటే.. మరొకరు ఆ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదు. దేశంలో వారసత్వ వివాదాల్లో ఎక్కువగా ఇళ్ల గురించే ఉంటున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. – సాక్షి, బిజినెస్ డెస్క్
బెంగళూరు సంస్థ ‘దక్ష్’ 2017లో చేపట్టిన అధ్యయనం ప్రకారం.. దేశంలో మూడింట ఒక వంతు వివాదాలు భూమి, ఇంటి గురించే ఉంటున్నాయి. ఇందులో 80 శాతం వారసత్వ హక్కులకు సంబంధించినవే కావడం గమనార్హం. 2016 నాటి ఒక సర్వే ప్రకారం చూసినా 66 శాతం సివిల్ వివాదాలు భూమి, ఇల్లు గురించే ఉన్నాయి. ఒకరికి మించిన వారసుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, వీలునామాలో ఆస్తుల పంపకం అసమంజసంగా ఉండడం, వీలునామాల ఫోర్జింగ్, ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలన్నీ కోర్టుల్లో న్యాయపోరాటాలకు దారితీస్తున్నాయి.
ఆస్తుల పంపకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వివాదాలను సాధ్యమైన మేర తగ్గించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘చట్టపరమైన సంక్లిష్టతలు, పరిపాలనా ప్రక్రియలకు దూరంగా ఉండడం అసాధ్యం. అయినప్పటికీ, ఆస్తులను ఎప్పుడు, ఎలా బదిలీ చేయాలన్నది నిర్ణయించడం ద్వారా వీటిని పరిమితం చేయొచ్చు’’అని 5నాన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో దినేష్ రోహిరా సూచించారు.
అందరికీ ఒక్కటే పరిష్కారం కాదు..
బ్యాంక్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్లో పెట్టుబడులు తదితర ఆర్ధిక ఆస్తుల బదిలీ ఎంతో సులభం. వీటి విలువను ఏరోజుకారోజు సులభంగా లెక్కించొచ్చు. కనుక వీటిని ఎంత మంది వారసుల మధ్య అయినా సులభంగానే పంపిణీ చేయొచ్చు. స్థిరాస్తులైన భూమి, ఇల్లుతోపాటు ఆభరణాలు, పెయింటింగ్లు, కళాకృతుల పంపిణీ సవాళ్లతో కూడుకున్నదే.
వీటి అసలైన విలువను అంచనా వేయడంలోనే సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఒకే ఇంటిని ఒకటికి మించి భాగాలుగా పంచే విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అది న్యాయవివాదానికి దారితీయవచ్చు. కనుక ఈ విషయంలో సాధ్యమైన మేర వివాద రహితంగా పరిష్కారాన్ని చూడాల్సి ఉంటుంది. వీలునామా, ట్రస్ట్, గిఫ్ట్ డీడ్, ఆస్తులను విక్రయించి పంచడం.. ఆస్తుల బదిలీకి ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వీటిలో సానుకూలతలే కాదు, ప్రతికూలతలూ ఉన్నాయి. తమకు అత్యంత అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది.
జీవించి ఉండగా /మరణానంతరం..
జీవించి ఉండగా ఆస్తుల బదిలీకి గిఫ్డ్డీడ్ చేయడం, ఫ్యామిలీ ట్రస్ట్కు బదిలీ చేయడం తదితర మార్గాలున్నాయి. ఆస్తులను విక్రయించి అందిరికీ సమానంగా పంచొచ్చు. లేదా హెచ్యూఎఫ్కు గిఫ్ట్డీడ్ చేయొచ్చు. మరణానంతరం ఆస్తులు ఎవరికి చెందాలన్నది వీలునామా ద్వారా నిర్దేశించొచ్చు.
ఆస్తుల విక్రయం
తమ తదనంతరం ఆస్తుల పంపకంలో సమస్యలు వస్తాయని సందేహించే వారు జీవించి ఉండగానే వాటిని విక్రయించి వారసులకు బదిలీ చేయడం ఒక పరిష్కారం. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన పిల్లలు కలిగిన వారికి ఇది మరింత అనుకూలం. అనవసర ప్రక్రియలను నివారించి, సమయాన్ని ఆదా చేస్తుంది. న్యాయ వివాదాలకు ఆస్కారం ఉండదు. స్వార్జితం అయితే తమకు నచ్చిన విధంగా పంపకాలు చేసుకోవచ్చు.
వీలునామా
తన మరణానంతరం ఆస్తుల సాఫీ బదిలీకి వీలునామా ఉపకరిస్తుంది. చట్టబద్ధమైన వారసులు కాని వారికి సైతం ఆస్తుల పంపకాన్ని వీలునామా ద్వారా నిర్ణయించొచ్చు. ఆస్తులను ఎలా పంచాలనే విషయంలో ప్రత్యేక సూచనలు ఇవ్వొచ్చు. మైనర్ పిల్లల కోసం సంరక్షకులను నియమించొచ్చు. వీలు నామా రాసినా కానీ, ఆ ఆస్తులపై జీవించి ఉన్నంత కాలం యజమానికే హక్కు, అధికారం ఉంటాయి. వీలునామాను ఎప్పుడైనా సమీక్షించొచ్చు. సులభంగా తిరగరాయొచ్చు. కానీ, అస్పష్టతకు తా విస్తే భవిష్యత్తులో కోర్టు వివాదాల చిక్కు ఇందులో ఎక్కువ. వీలునామా ద్వారా ప్రైవేటు ట్రస్ట్ను సైతం ఏర్పాటు చేసి, మరణానంతరం అమల్లోకి వచ్చేలా నిర్ణయించొచ్చు.
గిఫ్ట్ డీడ్
బహుమతి కింద ఒక వ్యక్తి తన స్థిర, చరాస్తులను స్వచ్ఛందంగా బదిలీ చేయడానికి గిఫ్ట్ డీడ్ అనుకూలిస్తుంది. జీవించి ఉండగా బదిలీ చేస్తున్నారు కనుక, తమ తదనంతరం న్యాయపరమైన, వారసత్వ వివాదాలకు అవకాశాలు చాలా తక్కువ. స్వీయ ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే గిఫ్ట్ డీడ్ అనంతరం ఆ ఆస్తులపై బదిలీ చేసిన వారు హక్కును కోల్పోవడం ఇందులో ఉన్న ప్రతికూలత.
ఫ్యామిలీ/ప్రైవేటు ట్రస్ట్
ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, 1882 కింద ఫ్యామిలీ లేదా ప్రైవేటు ట్రస్ట్ను ఏర్పాటు చేసి వాటికి ఆస్తులను బదిలీ చేయడం ఒక పరిష్కారం. ఇదొక చట్టబద్దమైన సంస్థ. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఎవరికి ఏ మేరకు ఆస్తుల ప్రయోజనాలు అందించాలో ఇందులో పేర్కొనొచ్చు. ట్రస్టీల బాధ్యతలు, లబ్ధి్దదారులు, అస్తుల నిర్వహణ గురించి స్పష్టంగా ట్రస్ట్ డీడ్లో పొందుపరచాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు, వారసులు, ఇతరులు చట్టపరంగా సవాలు చేయడాన్ని నిరోధిస్తుంది. లబ్ధిదారులకు రుణ దాతల నుంచి రక్షణనిస్తుంది.
ఇందులో ఉన్న ప్రతికూలత ఆస్తులను ట్రస్ట్కు బదిలీ చేసిన తర్వాత వాటిపై స్వీయ నియంత్రణ కోల్పోతారు. హక్కులన్నీ ట్రస్టీ చేతుల్లోకి వెళతాయి. కాకపోతే ఆ ఆస్తుల హక్కుదారులను నిర్ణయించే అధికారం ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటుకు ఎంతో సమయం తీసుకుంటుంది. నిర్వహణ కూడా సంక్లిష్టమైనది. కొన్ని ఆస్తులు కాకుండా పెద్ద మొత్తంలో ఆస్తులున్న వారికి ఇది అనుకూలిస్తుంది. ట్రస్ట్ తరఫున ప్రత్యేక రికార్డుల నిర్వహణ, రిటర్నుల దాఖలు తప్పనిసరి. దీని సవరణ, రద్దు అన్నది ఎంతో కష్టమైనది.
సెటిల్మెంట్ డీడ్
ఆస్తుల పంపకం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య అంగీకార పత్రం ఇది. కనుక న్యాయవివాదాలకు ఆస్కారం తక్కువ. దీన్ని రిజిస్టర్ చేసుకోకపోయినా కోర్టుల ముందు ఆధారంగా నిలుస్తుంది. రిజిస్టర్ చేసుకుంటే మంచిది. నిపుణుల సహకారంతో శ్రద్ధగా డ్రాఫ్టింగ్ చేసుకోవడం ద్వారా న్యాయవివాదాలను నివారించొచ్చు. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే తిరిగి కోర్టు అనుమతి లేకుండా రద్దు చేసుకోవడం కుదరదు. దీన్ని కోర్టుల్లో సవాలు చేసుకోవచ్చు.
ఉమ్మడి యజమాని
మరొకరితో ఉమ్మడిగా ఆస్తులను కలిగి, సరై్వవర్షిప్ హక్కుతో ఉంటే.. అప్పుడు ఒకరి మరణానంతరం మరొకరికి ఆస్తులు బదిలీ అయిపోతాయి. నామినేషన్, బెనిఫీషియరీ (లబ్దిదారు) నమోదు చేస్తే, మరణానంతరం ఆస్తులను వారు క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతించినట్టు అవుతుంది. ఈ విధానంలో వివాదాలకు అవకాశాలు ఎక్కువ.
నామినేషన్ ఉంటే ఆస్తులపై హక్కులు వారసులకు ఆలస్యంగా బదిలీ అవుతాయని గుర్తుంచుకోవాలి. బెనిఫీషియరీ నమోదు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే సరైన లబ్ధిదారులకు ఆస్తుల బదిలీ జరగకపోవచ్చు. ఆస్తుల బదిలీ ఏ రూపంలో చేస్తున్నా.. దీనికంటే ముందు న్యాయ నిపుణుల సహకారం తీసుకోవడం ద్వారా సాధ్యమైన మేర వివాదాలు తలెత్తకుండా నివారించొచ్చు.
ప్రాపర్టీ పంపకం సంక్లిష్టం చేయొద్దు..
ఒక్కరే వారసులు ఉన్న సందర్భాల్లో ఆస్తుల బదిలీకి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాబోవు. ఒకరికి మించి వారసుల మధ్య ఆస్తుల బదిలీయే సంక్లిష్టం అవుతుంది. ఒక ఇల్లు ఉంటే సమానంగా పంచుకోండంటూ చెప్పడం సులభమే. కానీ, ఈ విషయంలో వారసుల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే వివాదాలతో విలువైన సమయం హరించుకుపోతుంది. రెండు ఇళ్లు ఉంటే ఇద్దరు వారసులకు చెరొకటి పంచడం కూడా అంత సులభమేమీ కాదు. రెండూ ఒకే ప్రాంతంలో, ఒక్కటే విస్తీర్ణంతో ఉంటే ఫర్వాలేదు. వేర్వేరు చోట్ల ఉన్నప్పుడు వాటి విలువ ఒకే రకంగా ఉండదు.
ఇద్దరు వారసులూ ఒకే ప్రాపర్టీ కోరుకోవచ్చు. వారసుల్లో ఒకరు విదేశాల్లో ఉండి, ఒకరు ఇక్కడే స్థిరపడొచ్చు. విదేశాల్లో స్థిరపడిన వారు భారత్లో ఆస్తుల పట్ల ఆసక్తి చూపించరని, వాటి నిర్వహణ, పన్నుల చెల్లింపు వారికి భారంగా మారొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. కనుక విదేశాల్లో స్థిరపడిన వారికి భౌతిక ఆస్తుల కంటే
ఆరి్థక ఆస్తుల రూపంలో పంపకం మెరుగైన మార్గం అవుతుంది. ఒక్కటే ఇల్లు లేదా ఫ్లాట్ కలిగి, మరే ఆస్తుల్లేని వారు.. తమ తదనంతరం ఆ ఇంటిని విక్రయించి, వ చ్చిన మొత్తాన్ని వారసులకు సమానంగా బదిలీ చేయాలంటూ వీలునామా రాసుకోవడం మంచి ఆలోచన అని నిపుణుల సూచన. అంతేకానీ, ఒకే ప్రాపర్టీకి సమాన హక్కులు చెందేలా రాసినట్టయితే ఏకాభిప్రాయం కుదరని సందర్భాల్లో వివాదాలకు తావిచ్చినట్టు అవుతుంది.
అన్నీ ఆలోచించాకే అడుగు..
⇒ ఆస్తులను పోగేసి వారసులకు పంచిపెట్టాలా? అన్నది పూర్తిగా వ్యక్తిగత ఎంపికే. వారసుల కంటే ముందు తమ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. జీవితకాలం కష్టార్జితం వృద్ధాప్యంలో మెరుగైన జీవనానికి భరోసా ఇవ్వాలి. తమ అవసరాలకు పోను మిగిలినది తమ తదనంతరం వారసులకు పంపిణీ చేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. ముఖ్యంగా పిల్లల చదువులకు ఉన్నదంతా ఖర్చు చేసి.. వారికి మెరుగైన భవిష్యత్తును అందించిన తల్లిదండ్రులు మిగిలిన కొద్ది ఆరి్థక వనరులు/ఆస్తులను తమ కోసమే వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
⇒ తమ అవసరాలకు మించి అదనంగా కలిగి ఉంటే అప్పుడు జీవించి ఉండగానే బదిలీ చేయడాన్ని పరిశీలించొచ్చు.
⇒ కొందరు పిల్లలకు ఆస్తులను పంపిణీ చేసే సందర్భంలో జీవిత భాగస్వామిని విస్మరిస్తుంటారు. ముందుగానే ఆస్తులన్నింటినీ పిల్లలకు పంచేసిన తర్వాత.. దంపతుల్లో ఒకరు ముందుగా కాలం చేస్తే అప్పుడు రెండో వ్యక్తి యోగ క్షేమాలను పిల్లలు పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. కనుక జీవిత భాగస్వామికి ఈ విషయంలో భరోసా కల్పించాలి.
⇒ పిల్లల్లో ఒకరిద్దరు గొప్పగా స్థిరపడి.. ఎవరో ఒకరు వైవాహిక జీవితం విచి్ఛన్నం కారణంగా తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉండొచ్చు. అలాంటి ప్రత్యేక కేసుల్లో వారు జీవితాంతం అదే ఇంట్లో నివసించే హక్కు (రైట్ టు రిసైడ్)ను వీలునామా ద్వారా కల్పించొచ్చు.
⇒ ఆస్తుల పంపకంలో పిల్లల ఆసక్తులను పట్టించుకోవాలి. వారికి ఇష్టం లేని ఆస్తులు, వ్యాపారాలను విడిచిపెట్టడం మంచి నిర్ణయం కాబోదు. అలా ఇ చ్చిన వ్యాపారాలు, ఇంటి నిర్వహణను వారు పట్టించుకోకపోతే కొంత కాలానికి వాటి విలువ క్షీణిస్తుంది.
⇒ ముఖ్యంగా మైనర్ పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే వారి కోసం సంరక్షకులను వీలునామా ద్వారా నియమించుకోవచ్చు. లేదా ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించొచ్చు. ఇలాంటి వారికి ఆస్తుల బదిలీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల సాయంతో వారికి జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయ మార్గం కల్పించడంపై దృష్టి పెట్టాలి.
⇒ ఆస్తుల బదిలీకి అనుకూలమైన చట్టబద్ధమైన ప్రక్రియలు, పన్ను బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. విదేశాల్లో స్థిరపడిన పిల్లలకు ఆస్తులను బదిలీ చేస్తుంటే.. వారు తమ దేశాల్లో పన్నులు చెల్లించాల్సి రావచ్చు. కనుక వీటి గురించి ముందే పిల్లలతో చర్చించాలి.
⇒ ఆస్తుల పంపకం అసంబద్ధంగా ఉంటే అది న్యాయ వివాదాలకు దారితీయవచ్చు. దీనివల్ల ఎన్నో ఏళ్ల విలువైన కాలంతోపాటు న్యాయపోరాటానికి ఎంతో వ్యయం చేయాల్సి వస్తుంది. ఆస్తుల బదిలీలో సాధ్యమైన మేర పారదర్శకతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.
⇒ పిల్లలు ఇతర పట్టణాలు, విదేశాల్లో స్థిరపడినప్పుడు వారసత్వ ఆస్తుల పరిష్కారానికి తరచూ రావాల్సి వస్తే అది కష్టంగా మారుతుంది.
⇒ సక్సెషన్ సర్టిఫికెట్, చట్టబద్ధమైన వారసులేనన్న ధ్రువీకరణ, లెటర్ ఆప్ అడ్మిని్రస్టేషన్ పొందాలంటే వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలి. వీటికి కూడా ఎన్నో సార్లు తిరగాల్సి వస్తుంది.
⇒ తల్లిదండ్రుల పేరిట ఉన్న మ్యూచువల్ ఫండ్స్, షేర్లు ఇతర పెట్టుబడులు పిల్లలకు తెలియకపోవచ్చు. వీటి వివరాలను పిల్లలతో పంచుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన.
⇒ ఆస్తుల బదిలీ విషయంలో కొంత ఫీజు చెల్లించి నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడొద్దు.